Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?

  • ‘పెద్ది’కి మినహాయింపు అంటూ వైరల్ అయిన వార్తలు
  • పర్సంటేజ్ విధానంపై ఎగ్జిబిటర్ల కీలక క్లారిటీ
  • ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం
  • కమిటీ రిపోర్ట్ తర్వాతే థియేటర్లపై ఫైనల్ నిర్ణయం
Peddi

Peddi

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబోలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘పెద్ది’ (Peddi). ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్, బిజినెస్ వ్యవహారాలకు సంబంధించి గత కొన్ని రోజులుగా ఫిలిం నగర్ సర్కిల్స్‌లో ఒక వార్త జోరుగా ప్రచారంలో ఉంది. థియేటర్ల యాజమాన్యాలు ప్రస్తుతం అమలు చేయాలని చూస్తున్న ‘పర్సంటేజ్ విధానం’ (కలెక్షన్లలో థియేటర్ల వాటా) నుండి ‘పెద్ది’తో పాటు టాలీవుడ్‌కు చెందిన మరో 16 పెద్ద సినిమాలకు మినహాయింపు లభించిందని, ఆ చిత్రాలకు పాత పద్ధతిలోనే బిజినెస్ క్లియర్ అయిపోయిందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అయితే, ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఎగ్జిబిటర్లు తాజాగా స్పష్టం చేశారు. రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా విషయంలో తాము ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని వారు తేల్చి చెప్పారు.

 

పర్సంటేజ్ విధానం మినహాయింపులపై వస్తున్న వార్తలన్నీ కేవలం పుకార్లేనని కొట్టిపారేశారు. థియేటర్ల నిర్వహణ ఖర్చులు, లాభనష్టాల బేరీజుల కోసం ఇప్పటికే ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటయిందని ఎగ్జిబిటర్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ కమిటీ ఇచ్చే నివేదిక, తీసుకునే తుది నిర్ణయం మేరకే తాము మున్ముందు ఏ సినిమాకైనా థియేటర్లు కేటాయించడంపై ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. దీంతో రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రానికి పర్సంటేజ్ వివాదం నుండి ఇంకా పూర్తిస్థాయిలో లైన్ క్లియర్ కాలేదనే విషయం అర్థమవుతోంది. మరి ఈ సమస్యపై టాలీవుడ్ నిర్మాతలు, ఎగ్జిబిటర్ల కమిటీ కూర్చుని ఎలాంటి పరిష్కారం కనుగొంటారో వేచి చూడాలి.