తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ‘రెవెన్యూ షేరింగ్’ వివాదం ముదురుతోంది. థియేటర్ల యజమానులు (ఎగ్జిబిటర్లు), నిర్మాతల మధ్య మొదలైన ఈ మాటల యుద్ధం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్ అయింది. ఎగ్జిబిటర్లు తమ డిమాండ్లను వినిపిస్తూ మీడియా ముందుకు రాగా, దానికి కౌంటర్గా బుధవారం సాయంత్రం యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ సభ్యులు ప్రెస్ మీట్ నిర్వహించారు. టాలీవుడ్ అనేది నిర్మాత, పంపిణీదారుడు (డిస్ట్రిబ్యూటర్), ఎగ్జిబిటర్ ఈ మూడు చక్రాల మీద నడిచే బండి. అయితే ప్రస్తుతం ఈ మూడు వర్గాల మధ్య సమన్వయం దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది. కేవలం ఎగ్జిబిటర్లు మాత్రమే కాదు, నిర్మాతలు మరియు డిస్ట్రిబ్యూటర్లు కూడా తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నారని ప్రముఖ నిర్మాతలు స్పష్టం చేశారు. నిన్న ఎగ్జిబిటర్లు నిర్వహించిన ప్రెస్ మీట్పై నిర్మాతలు యలమంచిలి రవిశంకర్, సూర్యదేవర నాగవంశీ, సాహు గారపాటి తదితరులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎగ్జిబిటర్లు మీడియా ముందుకు వచ్చి “పర్సెంటేజ్ విధానం అమలు చేయకపోతే సినిమాలు ఆడం” అని బెదిరించినట్లు మాట్లాడటం సరైన పద్ధతి కాదని వారు హితవు పలికారు. ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా అందరూ కలిసి కూర్చుని చర్చించుకోవాలే తప్ప, ఇలా అల్టిమేటం ఇవ్వడం వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదని నిర్మాతలు తేల్చి చెప్పారు.
మైత్రీ మూవీ మేకర్స్ అధినేత యలమంచిలి రవిశంకర్ మాట్లాడుతూ.. “ఎగ్జిబిటర్లు ఇబ్బందుల్లో ఉన్నారనేది వాస్తవం, దానికి మేం అంగీకరిస్తాం. కానీ అదే సమయంలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కూడా సంతోషంగా లేరనే విషయాన్ని వారు గుర్తించాలి. సినిమా రంగంలో గత కొద్దికాలంగా సరైన విజయాలు లేక అందరూ నష్టాల్లోనే ఉన్నారు. ఇలాంటి సమయంలో ఒక వర్గం మాత్రమే తమ ప్రయోజనాల కోసం పట్టుబట్టడం సమంజసం కాదు” అని పేర్కొన్నారు. నిర్మాతల వైపు నుంచి వినిపిస్తున్న ప్రధాన డిమాండ్ ఏంటంటే.. అన్ని థియేటర్లను ఒకే గాటన కట్టలేము మల్టీప్లెక్స్ తరహాలో వసతులు ఉన్న థియేటర్లకు, కనీస సౌకర్యాలు లేని సింగిల్ స్క్రీన్లకు ఒకే రకమైన షేరింగ్ ఇవ్వడం అసాధ్యం. థియేటర్లలో ఉన్న సౌండ్ సిస్టమ్, సీటింగ్, శుభ్రత ఆధారంగా గ్రేడింగ్ చేయాలి, ప్రేక్షకులు థియేటర్లకు రావాలంటే వసతులు మెరుగుపరచాల్సిన బాధ్యత ఎగ్జిబిటర్లపై కూడా ఉంది. ముఖ్యంగా పెద్ద సినిమాలు విడుదలవుతున్న తరుణంలోనే ఇలాంటి గొడవలు ఎందుకు వస్తున్నాయని నిర్మాతలు ప్రశ్నిస్తున్నారు. ‘హరి హర వీరమల్లు’ లేదా ఇతర పెద్ద చిత్రాల విడుదలకు ముందు ఇలాంటి ఒత్తిడి తీసుకురావడం వల్ల పరిశ్రమకు నష్టం జరుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఏ మార్పు అయినా సరే.. రాత్రికి రాత్రే జరగదని, దీనిపై లోతైన చర్చలు జరగాలని కోరారు. సినిమా ఇండస్ట్రీ మనుగడ సాగించాలంటే ఈ మూడు వర్గాలు ఐకమత్యంగా ఉండాలి. ఎగ్జిబిటర్ల సమస్యలను పరిష్కరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెబుతూనే, తమ ఇబ్బందులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని నిర్మాతలు కోరుతున్నారు.మరి రాబోయే రోజుల్లో ఈ వివాదానికి ఎలాంటి పరిష్కారం లభిస్తుందో చూడాలి.
