Prabhas Srinu: ప్రముఖ నటుడు ప్రభాస్ శ్రీను తాజాగా ఎన్టీవీ పాడ్కాస్ట్లో తన సినీ కెరీర్ స్టార్టింగ్ రోజులు, ఫస్ట్ రెమ్యూనరేషన్, అత్యధిక పారితోషికం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నటుడిగా మొదటిసారి అందుకున్న పారితోషికం నుంచి ఇండస్ట్రీలో రెమ్యూనరేషన్ ఎలా నిర్ణయిస్తారో వరకు పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన తొలి సినిమా ‘మనం’ (నాగార్జున గారి చిత్రం కాదు, పాత చిత్రం) కోసం మొదటిసారి రూ.10 వేల రెమ్యూనరేషన్ అందుకున్నానని తెలిపారు. ఆ చిత్ర నిర్మాత రాఘవేంద్ర రెడ్డి తనను ఎంతో ప్రోత్సహించారని, ఇంటికి తీసుకెళ్లి ఆప్యాయంగా చూసుకుని తనకు తొలి పారితోషికం ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. ఆ సినిమా చిన్న బడ్జెట్తో కొత్త హీరోను పరిచయం చేస్తూ తెరకెక్కిందని, నిర్మాత ఎంతో కష్టపడి ఆ చిత్రాన్ని నిర్మించారని చెప్పారు. అంతకుముందు తాను సిటీ కేబుల్లో సీరియల్స్ చేస్తూ, అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఈ సినిమా తనకు మంచి స్టార్టింగ్ ఇచ్చిందన్నారు.
ప్రస్తుతం తాను ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటానన్న ప్రశ్నకు స్పందిస్తూ.. సినీ పరిశ్రమలో ఒక నటుడికి ఫిక్స్డ్ పారితోషికం అనే వ్యవస్థ ఉండదని చెప్పారు. సినిమా బడ్జెట్, నిర్మాత సామర్థ్యం, పాత్ర నిడివి, ప్రాజెక్ట్ స్థాయిని బట్టి రెమ్యూనరేషన్ మారుతూ ఉంటుందని వివరించారు. “ఇండస్ట్రీలో బయట ప్రచారం అయ్యే రెమ్యూనరేషన్లు చాలాసార్లు నిజం కావు. ఒక సినిమా కోసం ఎంత తీసుకున్నామన్నది కంటే, నిర్మాతలు చెప్పుకునే లెక్కలు వేరుగా ఉండొచ్చు. అందుకే బయట వినిపించే సంఖ్యలన్నీ నిజమని అనుకోవద్దు” అని అన్నారు. తాను ఇప్పటివరకు అందుకున్న అత్యధిక పారితోషికం గురించి కూడా ప్రభాస్ శ్రీను ఆసక్తికర విషయం వెల్లడించారు. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ‘గీత గోవిందం’ సినిమా కోసం కేవలం రెండు రోజుల పని చేసినందుకు రూ.3 లక్షలు అందుకున్నానని చెప్పారు. అది తన కెరీర్లో అప్పటివరకు వచ్చిన అత్యధిక పారితోషికమని పేర్కొన్నారు. సినిమాలో పాత్రకు సంబంధించిన మార్పుల కారణంగా తన పని పరిమితం అయినప్పటికీ, నిర్మాతలు ఇచ్చిన పారితోషికం తనకు ఎంతో ఆనందం కలిగించిందని వెల్లడించారు.

