Modi – Trump: ప్రపంచ దేశాల కళ్లన్నీ ఇప్పుడు ఫ్రాన్స్పైనే ఉన్నాయి. అక్కడ జరుగుతున్న జీ7 (G7) సదస్సులో ఒక అరుదైన, అత్యంత ప్రాధాన్యత కలిగిన దృశ్యం ఆవిష్కృతమైంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ – అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పరస్పరం ఎంతో ఆత్మీయంగా కరచాలనం చేసుకున్నారు. ఇరు దేశాల అగ్రనేతలు ముఖాముఖిగా కలుసుకోవడం గత 16 నెలల్లో ఇదే తొలిసారి కావడం విశేషం. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆతిథ్యమిస్తున్న ఈ సదస్సుకు ప్రపంచ దేశాల అధినేతలు హాజరయ్యారు. లీడర్స్ అందరూ ఒకచోట గుమిగూడిన సమయంలో.. ప్రధాని మోడీ చిరునవ్వుతో ట్రంప్కు అభినందనలు తెలుపుతూ చేతులు కలిపారు. ఆ తర్వాత ఇద్దరు నేతలు ఇతర ప్రపంచ దేశాల అధినేతలతో కలిసి తమకు కేటాయించిన సీట్లలో కూర్చున్నారు. దీనికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జీ7లో భారత్ సరికొత్త రికార్డ్
ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన కొత్తలో.. అంటే 2025 ఫిబ్రవరిలో ప్రధాని మోడీ వాషింగ్టన్ పర్యటనకు వెళ్లారు. అప్పట్లో వీరిద్దరూ ముఖాముఖిగా భేటీ అయ్యారు. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు (16 నెలల తర్వాత) వీరిద్దరూ నేరుగా కలుసుకోవడం ఇదే మొదటిసారి. అంతకుముందు సదస్సు ప్రాంగణానికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ స్వయంగా ఘనస్వాగతం పలికారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోడీ ఎవియన్ నగరానికి చేరుకున్నారు. జీ7 సదస్సులో భార ప్రధాని పాల్గొనడం ఇది వరుసగా ఏడోసారి కావడం గమనార్హం. జీ7 గ్రూపులో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం లేనప్పటికీ.. అంతర్జాతీయ చర్చల్లో, ప్రపంచ నిర్ణయాలలో భారత్ పోషిస్తున్న కీలక పాత్రకు ఈ వరుస ఆహ్వానాలే నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వేదిక ద్వారా భారత్ ముఖ్యంగా ‘గ్లోబల్ సౌత్’ (అభివృద్ధి చెందుతున్న దేశాల) సమస్యలను, వారి గళాన్ని ప్రపంచం ముందు ఉంచబోతోంది.
సదస్సు ప్రధాన అజెండా ఇదే..
ఈసారి జరుగుతున్న జీ7 సదస్సులో ప్రపంచాన్ని ప్రభావితం చేసే పలు కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి. ప్రపంచ ఆర్థిక స్థిరత్వం (Global Economic Stability), ఇంధన భద్రత (Energy Security), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత, ఉక్రెయిన్, మిడిల్ ఈస్ట్ (మధ్యప్రాచ్యం)లలో సాగుతున్న సుదీర్ఘ యుద్ధాలు, భౌగోళిక రాజకీయ పరిణామాలే ప్రధాన అజెండాగా ఈ సదస్సు జరుగుతుందని సమాచారం. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎదురవుతున్న సవాళ్లపై పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాలని ఈ వేదిక ద్వారా న్యూఢిల్లీ గట్టిగా నొక్కి చెప్పనుంది.

