తెలుగు నేల గర్వించదగ్గ మహా యోధుడు, ‘కలియుగ భీమ’ కోడి రామ్మూర్తి నాయుడు వారసులను కలిసేందుకు టాలీవుడ్ ప్రముఖులు సిద్ధమయ్యారు. రాబోయే ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ సినిమా యూనిట్ త్వరలోనే శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనుంది. ఈ మేరకు చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సానా, ప్రముఖ నిర్మాత సతీష్ కిలారు, స్టార్ లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ ఒక ప్రత్యేక బృందంగా ఏర్పడి నేరుగా కోడి రామ్మూర్తి నాయుడు మనవడు ఉంటున్న గ్రామానికి వెళ్లనున్నారు.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గంలోని వీరఘట్టం గ్రామంలో నివసిస్తున్న కోడి రామ్మూర్తి నాయుడు మనవడు వెంకట్రావును ఈ ‘పెద్ది’ బృందం వారి స్వగృహంలోనే మర్యాదపూర్వకంగా కలవనుంది. పాలకొండ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే ఈ గ్రామంలో టాలీవుడ్ ప్రముఖుల పర్యటన ఖరారు కావడంతో స్థానికంగా మరియు ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. కోడి రామ్మూర్తి నాయుడు శిష్యుడుగా ఈ సినిమాలో శివ రాజ్ కుమార్ కనిపించారు. కోడి రామ్మూర్తి నాయుడు శిష్యుడు గౌరనాయుడు అనే పాత్రలో ఆయన నటించారు. ఆయన దగ్గరే సినిమాలో రామ్ చరణ్ కుస్తీ నేర్చుకోవడం గమనార్హం.

