కొన్ని రోజుల నుంచి పవిత్రా లోకేష్, నరేష్ నిత్యం హెడ్లైన్స్లో నిలుస్తున్న విషయం తెలిసిందే! వీళ్లిద్దరూ సహజీవనం చేస్తున్నారని బెంగళూరు మీడియా కోడై కూస్తున్నప్పటి నుంచీ వీళ్లు టాక్ ఆఫ్ ద టౌన్గా నిలిచారు. తామిద్దరం మంచి స్నేహితులమేనని, అంతకుమించి తమ మధ్య మరే బంధం లేదని క్లారిటీ ఇచ్చినా.. ఎఫైర్ వార్తలు తగ్గడం లేదు. కన్నడ మీడియాలో వీరి గురించి రకరకాల కథనాలు ప్రసారం అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పవిత్రా లోకేష్ పోలీసుల్ని ఆశ్రయించింది.
తనని కొందరు మీడియా ప్రతినిధులు వెంబడిస్తున్నారని మైసూలురులోని వీవీ పురం పోలీస్ స్టేషన్లో పవిత్రా ఫిర్యాదు చేసింది. తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వార్తలు ప్రసారం చేస్తున్నారని.. తనకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అంతకుముందే పవిత్రా తన పేరుతో సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి, తన పరువుకు నష్టం కలిగించేలా పోస్టులు పెడుతున్నారంటూ కంప్లైంట్ కూడా ఇచ్చింది. ఇప్పుడు మీడియా ప్రతినిధులపై ఫిర్యాదు చేసింది.
కాగా.. రీసెంట్గా నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి చేసిన ఆరోపణల్ని పవిత్రా తోసిపుచ్చిన సంగతి తెలిసిందే! తనను బ్యాడ్ చేయడానికే ఆమె కన్నడ మీడియాలో లేనిపోని ఆరోపణలు చేసిందని, ఆమె చెప్పిన మాటల్లో వాస్తవం లేదని తెలిపింది. బెంగళూరులో ఓ చానెల్తో కలిసి ఆమె తనని బ్లాక్మెయిల్ చేస్తోందని చెప్పింది. ఒకప్పుడు హైదరాబాద్లో ఇలాగే చేసిందని పవిత్రా చెప్పుకొచ్చింది. చిలికి చిలికి గాలివానలా మారుతున్న ఈ వ్యవహారానికి ఇప్పుడప్పుడే ఫుల్ స్టాప్ పడేలా కనిపించడం లేదు.