ఇటీవల జరిగిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో విలక్షణ నటుడు పార్తిబన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఒక నటుడిగా ఆయన ప్రతిభను అందరూ గౌరవిస్తారు, కానీ ఆయన ప్రదర్శిస్తున్న Double Standards మాత్రం విమర్శలకు దారితీస్తున్నాయి. తమిళనాడులో పా. రంజిత్ నేతృత్వంలో జరిగే వేదికలపై పార్తిబన్ తరచుగా కుల రహిత సమాజం గురించి, సమానత్వం గురించి మాట్లాడుతుంటారు. అభ్యుదయ భావజాలం ఉన్న వ్యక్తిగా అక్కడ తనని తాను ఆవిష్కరించుకుంటారు. కానీ, అదే వ్యక్తి తెలుగు నేల మీదకు రాగానే తన అసలు గుర్తింపు తన కులం అని ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
Also Read:Harish Shankar: ‘చిరంజీవికి పవన్ తమ్ముడు మాత్రమే కాదు.. కొడుకు కూడా’ : హరీశ్ శంకర్
హైదరాబాద్లో జరిగిన ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ.. “నేను తెలుగువాడిని, నాయుడు కులానికి చెందినవాడిని. ఇది నా అసలు సిసలైన గుర్తింపు. కానీ నేను పుట్టి పెరిగింది అంతా చెన్నైలోనే. ప్రస్తుతం నాకు తెలుగు అంతగా రాదు, కానీ తదుపరి సక్సెస్ మీట్ నాటికి తెలుగు నేర్చుకుని మిమ్మల్ని అలరిస్తాను” అని పేర్కొన్నారు.తమిళనాడులో ప్రగతిశీల మాటలు చెబుతూ, వేరే రాష్ట్రానికి రాగానే కుల కార్డును బయటకు తీయడం కేవలం ఇక్కడి ఆడియన్స్ను ప్రసన్నం చేసుకోవడానికేనా? అనే ప్రశ్న తలెత్తుతోంది. తమిళ ప్రేక్షకులు ఎప్పుడూ నటుల వెనుక ఉన్న కులాన్ని చూడలేదు. రజనీకాంత్ నుంచి నేటి తరం నటుల వరకు ప్రతిభను చూసి మాత్రమే నెత్తిన పెట్టుకున్నారు. అటువంటి గడ్డపై ఎదిగి, ఇక్కడ కులాన్ని ప్రస్తావించడం ఆ సంస్కృతిని అవమానించడమే అవుతుంది. ఒక గొప్ప నటుడికి ఉండాల్సిన గుర్తింపు ఆయన కళ, కానీ పార్తిబన్ తన కులమే తన ప్రాథమిక గుర్తింపు అని చెప్పడం ఆయనలోని ద్వంద్వ వైఖరిని స్పష్టం చేస్తోంది. ఈ అంశంపై తమిళ నెటిజన్లు కూడా తీవ్రంగా స్పందిస్తూ, “మేము మిమ్మల్ని ఒక కళాకారుడిగా గౌరవించాము తప్ప మీ కులం చూసి కాదు” అని సోషల్ మీడియా వేదికగా గుర్తు చేస్తున్నారు.