NTV Exclusive: యంగ్ హీరో సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘మండాడి’. పడవ పందేల నేపథ్యంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో హీరో సుహాస్ ‘మండాడి’ షూటింగ్ అనుభవాలను పంచుకున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ షూటింగ్ సమయంలో ఎదురైన సవాళ్ల గురించి ఆయన చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మండాడి’ క్లైమాక్స్ మొత్తాన్ని దాదాపు 45 రోజుల పాటు సముద్రంలోనే చిత్రీకరించినట్లు సుహాస్ తెలిపారు. ప్రతిరోజూ ఉదయం సముద్రంలోకి వెళ్లి.. సాయంత్రానికి తిరిగి వచ్చేవాళ్లమని చెప్పారు. సముద్రంలో షూటింగ్ చేయడం అంత సులభం కాదని, ఎన్నో ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొన్నామని వెల్లడించారు.
షూటింగ్ సమయంలో బోట్లు తిరగబడటం వంటి ప్రమాదాలు చాలాసార్లు ఎదురయ్యాయని సుహాస్ తెలిపారు. అలాంటి సందర్భాల్లో నాలుగైదు సార్లు దాదాపుగా ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందని చెప్పారు. “ఇక అయిపోయాం అనుకున్నాం” అంటూ ఆ సమయంలో వాళ్లు ఎదుర్కొన్న భయానక పరిస్థితులను గుర్తుచేసుకున్నారు. సముద్రంలో 45 రోజుల పాటు షూటింగ్ చేయడం తన కెరీర్లోనే అత్యంత రిస్క్తో కూడుకున్న అనుభవమని సుహాస్ పేర్కొన్నారు. ఇకపై ఇలాంటి లైఫ్ రిస్క్ చేసే సినిమాలు చేయనని కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే ‘మండాడి’ కోసం తాము పడిన కష్టం, ఎదుర్కొన్న సవాళ్లు వెండితెరపై ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని అందిస్తాయని ఆయన చెప్పారు. కాగా.. ‘మండాడి’ చిత్రాన్ని ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ బ్యానర్పై మతిమారన్ పుగళేంది తెరకెక్కిస్తున్నారు. ఎల్రెడ్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మహిమా నంబియార్ హీరోయిన్గా నటిస్తున్నారు. సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ‘మండాడి’ టీజర్కు మంచి స్పందన వచ్చింది. టీజర్లోని బోట్ సీక్వెన్స్, పడవ పందేల సన్నివేశాలు, యాక్షన్, ఎమోషన్, విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 10న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

