గురువారం విడుదలైన ‘అఖండ’ సినిమా అఖండ విజయాన్ని అందుకొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ కి చేదు అనుభవం ఎదురయ్యింది. అఖండ ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తూ ఒక అభిమాని గుండె ఆగింది. ఈస్ట్ గోదావరి జిల్లా ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జాస్తి రామకృష్ణ బాలకృష్ణకు వీరాభిమాని.. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 2 అఖండ రిలీజ్ కావడంతో ఫస్ట్ డే ఫస్ట్ షో స్థానిక శ్యామల థియేటర్లో చూడడానికి వచ్చాడు.
అప్పటివరకు జై బాలయ్య.. జై బాలయ్య అంటూ ఎంతో ఉత్సాహంగా ఉన్న రామకృష్ణ అఖండ సినిమా చూస్తూనే ఒక్కసారిగా థియేటర్లో కుప్పకూలి పడిపోయాడ. దీంతో థియేటర్ యాజమాన్యం ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు స్పష్టం చేశారు. సినిమా చూస్తున్న సమయంలో బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో రామకృష్ణ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో బాలయ్య అభిమానులు ఆయన మృతికి సంతాపం తెలుపుతూ విచారం వ్యక్తం చేస్తున్నారు.