‘ఆయ్’, ‘సేవ్ ది టైగర్స్’, ‘వికటకవి’, ‘గుర్తుకొస్తున్నాయి’ వంటి చిత్రాలు, వెబ్ సిరీస్లతో తనదైన మార్క్ మ్యూజిక్ అందించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ. వైజాగ్ నుంచి టీసీఎస్ సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి సినిమా రంగంలోకి అడుగుపెట్టిన ఆయన, పదేళ్ల తన సినీ ప్రయాణం, జనసేనాని పవన్ కళ్యాణ్తో జరిగిన ప్రత్యేక సమావేశం, ఏఐ ప్రభావం వంటి పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. నేను “జనసేన కార్యక్రమాలకు నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తుంటాను. ప్రధాని మోదీ గారిని పవన్ గారు కలిసినప్పుడు నేను చేసిన స్కోర్ చూసి ఆయన స్వయంగా పిలిపించారు. కేవలం ఐదు నిమిషాలు మాట్లాడి ఫొటో దిగి వచ్చేస్తానేమో అనుకున్నా. కానీ ఆయన ఒక్కరే కూర్చుని దాదాపు అరగంట పాటు మాట్లాడారు. నా దగ్గరున్న కాఫీ మగ్ షేప్ బోస్ స్పీకర్ చూసి ‘ఇదేంటి కాఫీ కప్పు పట్టుకొచ్చావా?’ అని సరదాగా జోక్స్ వేశారు. భవిష్యత్తులో పొలిటికల్గా లేదా పీకే క్రియేటివ్స్ బ్యానర్లో కలిసి పనిచేద్దామని చెప్పారు.”
దేవిశ్రీ ప్రసాద్ స్ఫూర్తితో పరిశ్రమలోకి వచ్చానని, వైజాగ్లో ఏడేళ్లు టీసీఎస్ ఉద్యోగం చేస్తూనే మ్యూజిక్ ప్రాక్టీస్ చేశానని తెలిపారు. స్నేహితుడు శ్రీచరణ్ పాకాల ద్వారా ‘గూఢచారి’ సినిమాకి కీబోర్డ్ ప్రోగ్రామర్గా తన ప్రయాణం మొదలైందని చెప్పారు. “‘ఆయ్’ సినిమాలో రామ్ మిర్యాల రెండు పాటలు ఇస్తే, మిగతా ఆల్బమ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ నేనే చేశాను. కానీ మీడియాలో క్రెడిట్స్ ఆయనకే ఎక్కువగా వెళ్లినప్పుడు నిర్మాత బన్నీ వాస్ గారు ప్రతి వేదికపై నా పేరును ప్రస్తావించి కరెక్ట్ చేశారు.” ఏఐ వల్ల అసలైన సంగీత దర్శకులకు ఎలాంటి ముప్పు ఉండదని స్పష్టం చేశారు. కొంతమంది నిర్మాతలు ఏఐ ట్రాక్స్ తెచ్చి ఇలా కావాలని అడిగితే ‘మేమెందుకు మీరే కొట్టుకోండి’ అనిపిస్తుందని సరదాగా వ్యాఖ్యానించారు. ఏఐని వాడి టెక్నీషియన్ పనిచేయొచ్చు కానీ, ఎవరూ మ్యూజిక్ డైరెక్టర్ కాలేరని అన్నారు. థియేటర్ల సౌండింగ్కు తగ్గట్టుగా ప్రాణం పెట్టి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తే, అది ఓటీటీలోకి వచ్చేసరికి ఆ కష్టంలో 50 శాతం ప్రభావం తగ్గిపోతుందని, ‘వికటకవి’ థియేటర్లలో వచ్చి ఉంటే సౌండింగ్ వేరే లెవెల్లో ఉండేదని అభిప్రాయపడ్డారు. ఎలాంటి కమర్షియల్ సినిమాకైనా అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చే కాన్ఫిడెన్స్ తనకు ఉందని, రాబోయే రోజుల్లో పెద్ద ప్రాజెక్టులతో ఆడియన్స్ను మరింతగా అలరిస్తానని అజయ్ అరసాడ ధీమా వ్యక్తం చేశారు.

