సినీ పరిశ్రమలో ఈ మధ్య కాలంలో సినిమా విడుదలైతే చాలుటికెట్ ధరలు పెంచేయడం, బుక్ మై షో రేటింగ్స్ను మేనేజ్ చేయడం లేదా కోర్టు ఆర్డర్స్ తెచ్చి రేటింగ్స్ ఆపాలని చూడడం, తెల్లవారుజామునే ప్రీమియర్ షోల హడావుడి చేయడం, చివరకు సినిమా నచ్చలేదని రివ్యూ రాసిన రివ్యూవర్లపై బెదిరింపులకు దిగడం వంటి ఎన్నో అడ్డదారులు తొక్కుతున్నారు కొందరు పెద్ద నిర్మాతలు, స్టార్ హీరోలు. తమ సినిమా ప్లాప్ అని తేలిపోతుందనే భయంతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి ఇలాంటి పద్ధతులు వాడుతున్నారు. కానీ ప్రేక్షకులను ఇలాంటి జిమ్మిక్కులతో మోసం చేయలేరని రుజువు చేస్తూ మా ఇంటి బంగారం, లెనిన్ సినిమాలు ఘన విజయం సాధించాయి.
సమంత ప్రధాన పాత్రలో నటించిన ఎమోషనల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా ‘మా ఇంటి బంగారం‘ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు లేకుండా నార్మల్ టికెట్ ధరలతో కేవలం కంటెంట్ బలాన్ని నమ్ముకుని ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫలితంగా తెలుగు సినీ చరిత్రలోనే రూ. 100 కోట్ల క్లబ్లో చేరిన మొట్టమొదటి లేడి ఓరియెంటెడ్ సినిమాగా రికార్డు సృష్టించింది.
మరోవైపు అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లెనిన్‘ కూడా ఎలాంటి స్పెషల్ బెనిఫిట్స్, టికెట్స్ ప్రైసింగ్ లేకుండా రిలీజ్ అయి అఖిల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించి సత్తా చాటింది. నిజాయితీ గల కంటెంట్తో థియేటర్లలోకి వచ్చిన ఈ రెండు సినిమాలు సాధించిన విజయం ప్రమోషన్ల పేరుతో ప్రేక్షకులపై భారం వేసే స్టార్ హీరోలకు, కార్పొరేట్ ప్రొడక్షన్ హౌస్లకు ఒక బలమైన చెంపపెట్టు. ప్రేక్షకుల రేటింగ్స్ను అడ్డుకోవడానికి కోర్టుల చుట్టూ తిరగడం, రివ్యూవర్లను బెదిరించడం వంటి వ్యూహాలు కాకుండా… సినిమా కథపై కథనంపై దృష్టి పెడితే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని ఈ విజయాలు నిరూపించాయి.
ఇప్పటికైనా నిర్మాతలు, స్టార్స్ తమ పాత పద్ధతులను, అనవసరమైన వ్యూహాలను పక్కన పెట్టాలి. సినిమా విధిరాతను నిర్ణయించే అధికారాన్ని ప్రేక్షకుడికి వదిలేయాలి. ఎందుకంటే ప్రేక్షకుడు ఎప్పుడూ సరైన నిర్ణయమే తీసుకుంటాడు నిజమైన ప్రతిభను మంచి సినిమాను ఎల్లప్పుడూ ఆదరిస్తారు.

