Lata Mangeshkar: ఈ శతాబ్దం లత గానానిదే!
Lata Mangeshkar: కాశ్మీరం మొదలు కన్యాకుమారి దాకా విస్తరించిన భరతావనిని తన మధురగానంతో అలరించిన గానకోకిల లతా మంగేష్కర్. లతా మంగేష్కర్ పాట మనకు లభించిన ఓ వరం అనే చెప్పాలి. ఆ పాటతోనే పలు తరాలు అమృతపానం చేశాయి. ఆ పాటతోనే ఎందరో గాయనీమణులు తమ గళాలకు మెరుగులు దిద్దుకున్నారు. ఈ నాటికీ లత పాటతోనే ప్రతిదినం పరవశించి పోయేవారు ఎందరో ఉన్నారు.
లతా మంగేష్కర్ 1929 సెప్టెంబర్ 28న జన్మించారు. వారి కుటుంబం పాటల పొదరిల్లు. ఆమె తండ్రి దీనానాథ్ మంగేష్కర్ సుప్రసిద్ధ సంగీతకళాకారుడు. ఆయనకు ఐదు మంది పిల్లలు. వారిలో లతనే అందరికంటే పెద్ద. ఆమె తరువాత ఆశ, హృదయనాథ్, ఉష, మీనా ఉన్నారు. దీనానాథ్ మరణంతో ఇంటి భారం చిన్నారి లతపైనే పడింది. కొన్ని చిత్రాల్లో బాలనటిగానూ నటించారు లత. తరువాతి రోజుల్లో లత గాయనిగా మారి ప్రతి పాటలోనూ అమృతం కురిపించారు.
Also Read
ఆ నాటి మేటి సంగీత దర్శకుల్లో నౌషద్ అలీదే పైచేయి. లతలో అమృతం కురిపించే గానం దాగుందని నౌషద్ పసికట్టి ఆమెకు తగ్గ అవకాశాలు కల్పించారు. జనం మదిలో లతకు గానకోకిలగా పట్టం కట్టించారు. నౌషద్ స్వరకల్పనలో రూపొందిన ‘బైజూ బావ్రా’తోనే లతా మంగేష్కర్, మహ్మద్ రఫీ ఇద్దరూ స్టార్ సింగర్స్ అయిపోయారు. తరువాత సి.రామచంద్ర, ఎస్డీ బర్మన్, శంకర్ జైకిషన్ వంటి సంగీత దర్శకులు సైతం లత గానంలోని మధురాన్ని తమ బాణీలతో జోడీ కట్టించి, జనానికి మరపురాని మధురాన్ని పంచారు. ఇక లతతో మదన్ మోహన్ స్వరపరచిన పాటలు విశేషంగా అలరించాయి.
‘పరిచయ్’ చిత్రంలో గుల్జార్ రాసిన పాటకు ఆర్డీ బర్మన్ బాణీలు కూర్చగా 1972లో లత గానం చేసిన పాట ఆమెకు తొలి నేషనల్ అవార్డును సంపాదించి పెట్టింది. 1974లో ‘కోరా కాగజ్’ సినిమాలో కళ్యాణ్ జీ – ఆనంద్ జీ బాణీల్లో లతకు మరో నేషనల్ అవార్డు లభించింది. లతా మంగేష్కర్ ను మూడోసారి ఉత్తమ గాయనిగా జాతీయ స్థాయిలో నిలిపిన చిత్రం ‘లేకిన్’. ఈ చిత్రానికి ఆమె తమ్ముడు హృదయనాథ్ మంగేష్కర్ సంగీతం సమకూర్చడం విశేషం. నాలుగు సార్లు ఉత్తమ గాయనిగా ఫిలిమ్ ఫేర్ అవార్డులనూ లతా మంగేష్కర్ సొంతం చేసుకున్నారు. ఇక లత కీర్తి కిరీటంలో ప్రతిష్ఠాత్మక అవార్డులూ చోటు చేసుకున్నాయి. 1969లో పద్మభూషణ్, 1989లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 1999లో పద్మవిభూషణ్, 2001లో భారతరత్న లత దరి చేరాయి. ఇలా దేశం గర్వించదగ్గ అవార్డులన్నీ లత గానామృతం చేరి మరింత వెలుగులు విరజిమ్మాయి.
తెలుగువారితోనూ లతకు విడదీయరాని బంధం ఉంది. 1955లో తెరకెక్కిన ఏయన్నార్ ‘సంతానం’ చిత్రంలో తొలిసారి లత నోట తెలుగుపాట పలికింది. సుసర్ల దక్షిణామూర్తి స్వరకల్పనలో లత తన తొలి తెలుగు పాట “నిదుర పోరా తమ్ముడా…” గానం చేసి అలరించారు. ఈ పాట ఈ నాటికీ సంగీతాభిమానులను పరవశింప చేస్తూనే ఉంది. 1988లో నాగార్జున హీరోగా రూపొందిన ‘ఆఖరి పోరాటం’లో ఇళయరాజా స్వరకల్పలో “తెల్లచీరకు తకధిమి…” పాటను ఆలపించారు లత. ఇక 1991లో యన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో నటించి, నిర్మించిన ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ హిందీ వర్షన్ లో లతా మంగేష్కర్ గానం చేశారు. ఈ చిత్రానికి రవీంద్ర జైన్ సంగీతం సమకూర్చారు. అలా నందమూరి, అక్కినేని కుటుంబాలతో లతకు అనుబంధం ఉంది. మరో విశేషమేమంటే, ఆ ఇద్దరు మహానటుల పేరున నెలకొల్పిన జాతీయ అవార్డులనూ లతా మంగేష్కర్ సొంతం చేసుకున్నారు. 1999లో యన్టీఆర్ జాతీయ అవార్డు, 2009లో ఏయన్నార్ జాతీయ పురస్కారం లతా మంగేష్కర్ కు లభించాయి. ఈ యేడాది ఫిబ్రవరి 6న ఈ గాన కోకిల దివికేగింది. భౌతికంగా లత లేకున్నా, ఆమె గానం మాత్రం మహదానందం పంచుతూనే ఉంది. భావితరాలను సైతం పులకింప చేస్తూనే ఉంది.
తాజావార్తలు
-
Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
-
యష్ ‘టాక్సిక్’కు ఓటీటీ టెన్షన్..
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!