‘కేజీఎఫ్’ నటుడు హరీశ్ రాయ్ కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా థైరాయిడ్ క్యాన్సర్తో పోరాడుతూ వచ్చారు. ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ, వ్యాధి తీవ్రత పెరగడంతో చివరికి ఆయన గురువారం ఉదయం తుది శ్వాస విడిచారు. దీంతో హరీశ్ రాయ్ మృత్యువుతో కన్నడ సినీ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. యశ్, శ్రీమురళి, రమేశ్ అరవింద్ వంటి పలువురు నటులు సోషల్ మీడియాలో ఆయన మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “ఒక నిజమైన పోరాట యోధుడిని కోల్పోయాం” అంటూ అభిమానులు స్మరించారు. తన చిరునవ్వుతో, సహజమైన నటనతో ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్న హరీశ్ రాయ్ ఇకలేరన్న వార్త సినీప్రియులను కన్నీరు పెట్టిస్తోంది.
Also Read : Keerthy Suresh : పెళ్లి తర్వాత స్పీడ్ పెంచిన కీర్తి – కొత్త యాక్షన్ చిత్రం ప్రకటించిన బ్యూటీ
ఆయన వయసు 53 సంవత్సరాలు. గతంలో ఓ ఇంటర్వ్యూలో హరీశ్ రాయ్ తన అనారోగ్య పరిస్థితి గురించి హృదయవిదారకంగా వెల్లడించారు. “నేను క్యాన్సర్తో పోరాడుతున్నాను. ‘కేజీఎఫ్’లో నా లుక్ వెనుక కూడా అదే కారణం ఉంది. నా గొంతు క్యాన్సర్ వల్ల వాచిపోయింది. ఆ వాచిన ప్రాంతం కనపడకుండా ఉండేందుకు నేను గడ్డం పెంచుకున్నాను” అని చెప్పారు. ఆ సమయంలో ఆయనకు పలువురు సినీ ప్రముఖులు, ముఖ్యంగా యశ్ సహా కొందరు హీరోలు ఆర్థిక సాయం చేసినట్లు తెలిసింది. ఇక హరీశ్ రాయ్ 1995లో వచ్చిన ‘ఓం’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆ సినిమాలో డాన్ రాయ్ పాత్రలో అద్భుతంగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత పలు కన్నడ సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. కానీ ఆయన కెరీర్లో నిజమైన మలుపు తెచ్చింది ‘కేజీఎఫ్’ సినిమా. ఆ సినిమాలో ఆయన చేసిన ఖాసిం చాచా పాత్ర ప్రేక్షకుల మదిలో ముద్ర వేసింది. యశ్ ప్రధాన పాత్రలో వచ్చిన ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా విజయాన్ని సాధించగా, హరీశ్ పాత్రకు కూడా మంచి గుర్తింపు వచ్చింది.