అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా హీరో హీరోయిన్లుగా మోహన్ శ్రీవత్స డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా ‘కరణ్ అర్జున్’. ఈ మూవీని డా. సోమేశ్వర రావు పొన్నాన , బాలక్రిష్ణ ఆకుల, సురేష్ ,రామకృష్ణ , క్రాంతి కిరణ్ నిర్మించారు. రవి మేకల ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ సినిమా ఇదే నెల 24న 186 థియేటర్లలో విడుదల కాబోతోంది.
ఈ సందర్భంగా దర్శకుడు మోహన్ శ్రీవత్స మాట్లాడుతూ, ”మహాభారతం లోని కర్ణుడు , అర్జునుడి ఎమోషన్స్ లైన్ తీసుకొని సాంకేతికంగా ఇప్పుడున్న జనరేషన్ కు తగ్గట్టు మలుస్తూ తెరకెక్కించిన ఈ చిత్రంలోని ప్రతి సీన్ ఎంటర్ టైన్ చేస్తుంది. మంచి లొకేషన్స్ కొరకు పాకిస్థాన్ బార్డర్ లో ఎంతో స్ట్రగుల్స్ ఫేస్ చేసి షూట్ చేశాం. ప్రతి సన్నివేశం ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. ఈ సినిమాలో ఆర్టిస్టులు కొత్తవారని చూడకుండా, ప్రేక్షకులకు మంచి కంటెంట్ ఇవ్వాలని చేసిన సినిమా ఇది. దీన్ని మూడు పాత్రలతో రోడ్ థ్రిల్లర్ గా తెరకెక్కించాం. మొదట ఈ సినిమాను తెలుగు రాష్ట్రాలలో మాత్రమే రిలీజ్ చెయ్యాలి అనుకున్నాం. కానీ సౌత్, నార్త్ లో కూడా మా మూవీని ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది” అని అన్నారు. ఈ సినిమా ప్రచారంలో దర్శకులు సుకుమార్, అనిల్ రావిపూడి, పరశురామ్ ఎంతో సహకరించారని నిర్మాతల్లో ఒకరైన బాలకృష్ణ ఆకుల తెలిపారు. హీరో నిఖిల్ కుమార్ మాట్లాడుతూ, “ఇది మా నాన్న డ్రీమ్. నన్ను హీరోగా తెరపై సినిమా చూడాలనుకున్నారు. మా నాన్న అనుకున్నట్లే సినిమా చాలా బాగా వచ్చింది. ఇందులో ఎటువంటి వల్గారిటీకీ తావు ఇవ్వలేదు. మూవీ మొత్తం లవ్ అండ్ యాక్షన్ ఉంటుంది. చూసిన ప్రేక్షకుడికి ఈ సినిమా నచ్చుతుంది” అని చెప్పారు. నటుడిగా తనకిదే మొదటి సినిమా అని మరో హీరో అభిమన్యు తెలిపాడు.