జనాన్ని కట్టి పడేయాలంటే వైవిధ్యాన్ని పట్టేసుకోవాలి.. మరీ చుట్టేసుకోవాలి. అల్లు అర్జున్ అదే పంథాలో పయనిస్తున్నారు. నటనతోనే కాదు, లుక్స్తో, వరైటీ కాస్ట్యూమ్స్తో, గెటప్స్తో స్టైలిష్ స్టార్గా జనం మదిలో నిలిచారు అల్లు అర్జున్. బన్నీ వైవిధ్యమే ఆయనను సక్సెస్ రూటులో సాగేలా చేస్తోందని చెప్పవచ్చు.
అల్లు అర్జున్ 1982 ఏప్రిల్ 8న మద్రాసులో జన్మించారు. తాత అల్లు రామలింగయ్య మహా హాస్యనటుడు. తండ్రి అల్లు అరవింద్ నిర్మాతగా ఎంతో పేరున్నవారు. మరోవైపు మేనమామ చిరంజీవి అభినయం ఆరంభం నుంచీ బన్నీని ఆకట్టుకుంటూనే ఉంది. ఇలా ఎటు చూసినా, బన్నీ మనసును సినిమారంగంవైపు తీసుకువెళ్ళే అంశాలు చుట్టూ ఉండేవి. మామ చిరంజీవి డాన్సుల్లోనూ, ఫైట్స్ లోనూ మేటి అనిపించుకున్నారు. అదే పంథాలో పయనించాలని బన్నీ మొదట్లోనే డాన్సుల్లో రాణించారు. చిరంజీవితో అల్లు అరవింద్ నిర్మించిన ‘డాడీ’ సినిమాలో బన్నీ కాసేపు డాన్స్ చేస్తూ కనిపించి, ఎంతగానో ఆకట్టుకున్నారు. తరువాత తండ్రి ప్రోత్సాహంతో ‘గంగోత్రి’ ద్వారా హీరోగా పరిచయం అయ్యారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు రూపొందించిన ‘గంగోత్రి’ బన్నీకి మంచి మార్కులే సంపాదించి పెట్టింది. తరువాత ‘ఆర్య’గా బన్నీ అలరించిన తీరు జనాన్ని భలేగా ఆకట్టుకుంది. ఈ రెండు చిత్రాల విజయంతో హుషారుగా సాగుతున్న బన్నీని పూరి జగన్నాథ్ ‘దేశముదురు’గా తీర్చిదిద్దారు. ఈ సినిమా అనూహ్య విజయం సాధించడమే కాదు, ఇప్పటికీ బన్నీ కెరీర్లో అత్యధిక కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకున్న చిత్రంగా నిలిచే ఉంది. ఈ సినిమాతోనే బన్నీ స్టైలిష్ స్టార్గానూ జేజేలు అందుకున్నారు. ఇందులో బన్నీ తన సిక్స్ ప్యాక్తో అభిమానులను ఫిదా చేశారు. ఎంతోమంది ఇతర హీరోలు సిక్స్ ప్యాక్పై మనసు పారేసుకొనేందుకు కారకులయ్యారు.
తొలి నుంచీ కష్టపడి పనిచేయడం బాగా అలవాటయిన బన్నీ తన దరికి చేరిన ప్రతి పాత్రలోనూ తొలి సినిమాలో నటిస్తున్నట్టే భావించి నటించాడు. బన్నీ, బద్రీనాథ్, వేదం, జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి వంటి చిత్రాలతో నటునిగా మంచి మార్కులు కొట్టేసిన బన్నీ, ‘రేసుగుర్రం’తో మరో సాలిడ్ హిట్ పట్టేశారు. అయితే వాటితో బన్నీకి ఆనందం కలగలేదు. ఎందుకంటే తన సీనియర్స్, తన తరం హీరోలు ఏదో ఒక సందర్భంలో బ్లాక్ బస్టర్స్ ను తమ ఖాతాలో వేసుకున్నారు. బన్నీకి భలేగా విజయాలు నమోదు అయ్యాయే కానీ, ‘ఈ సంవత్సరం నాది’ అని చెప్పుకొనే స్థాయిలో బ్లాక్ బస్టర్ పడలేదు. అల్లు అర్జున్ అభిలాషను తీర్చడానికి అన్నట్టు త్రివిక్రమ్ అతనికి ‘అల…వైకుంఠపురములో’ వంటి బంపర్ హిట్ ను అందించాడు. 2020 సంక్రాంతి సంబరాల్లో ‘అల…వైకుంఠపురములో’ చిత్రానిదే పైచేయిగా నిలచింది. బన్నీ ఆశించిన బంపర్ హిట్ ఆయన సొంతమయింది. ఈ సినిమా వసూళ్ళలో ‘నాన్-బాహుబలి’ రికార్డును సొంతం చేసుకోగా, పాటల్లో మాత్రం ఎవరికీ అందనంత ఎత్తున నిలచింది. ఈ చిత్రంలోని మూడు పాటలు రెండువందల మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి అరుదైన రికార్డు సృష్టించాయి. టాప్ టెన్లో ‘అల…వైకుంఠపురములో’లోని మూడు పాటలు నిలవడం మరో రికార్డు. ఇలా అనేక రికార్డులను తన సొంతం చేసుకున్న అల్లు అర్జున్ ‘పుష్ప’తోనూ గత సంవత్సరం జనాన్ని అలరించారు. ‘పుష్పరాజ్’గా అల్లు అర్జున్ అభినయం చూసిన వారెందరో ఆయనను అభినందించారు. బన్నీకి తొలి పాన్ ఇండియా మూవీగా వచ్చిన ‘పుష్ప’ ఉత్తరాదిన సైతం ఆయనకు ఓ స్పెషల్ క్రేజ్ ను సంపాదించి పెట్టింది. త్వరలోనే ‘పుష్ప’ రెండో భాగం రానుంది. అందులో బన్నీ ఏ తీరున అలరిస్తారో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సారి ఏ తరహా వైవిధ్యంతో అల్లు అర్జున్ జనాన్ని ఆకట్టుకుంటారో చూడాలి.
(ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు)
