టాలీవుడ్ స్టార్ కపుల్ సమంత, నాగ చైతన్య తమ వివాహ బంధానికి స్వస్తి పలకబోతున్నారని గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ రూమర్స్ సామ్ అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. సమంత తన సోషల్ మీడియా ఖాతాల నుంచి ‘అక్కినేని’ అనే ఇంటి పేరును తొలగించినప్పటి నుంచి మొదలైన ఈ పుకార్లు ఆగస్టు 29న జరిగిన నాగ్ పుట్టినరోజు వేడుకల్లో సమంత కనిపించకపోవడంతో మరింత బలపడ్డాయి.
Read Also : ఈడీ విచారణలో స్టార్ హీరోయిన్… రూ.200 కోట్లు దోపిడీ కేసు
తాజాగా ఈ విషయం గురించి సమంత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి ‘అక్కినేని’ అనే పేరు ఎందుకు తీసేసారు? అని అడిగినప్పుడు దానికి కారణం ఏంటో చెప్పడానికి ప్రస్తుతం తాను సిద్ధంగా లేనని ఆమె వెల్లడించడం అందరికీ షాక్ ఇచ్చింది. “ది ఫ్యామిలీ మ్యాన్-2” విడుదల సమయంలో తనపై ఎన్ని ట్రోల్స్ జరిగినా స్పందించలేదని, అలాగే ఇప్పుడు కూడా దీని గురించి మాట్లాడడం తనకు ఇష్టం లేదని చెప్పింది. ఎవరో అడిగారని కాకుండా తనకు చెప్పాలన్పించినప్పుడు మాత్రమే చెప్తాను అని తేల్చేసింది.
ఇక “ది ఫ్యామిలీ మ్యాన్-2″లో తాను నటించిన రాజి పాత్రకు అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందంటూ ఆ పాత్ర ఇచ్చినందుకు రాజ్ అండ్ డికెలకు కృతజ్ఞతలు తెలిపింది. “శాకుంతలం” గురించి మాట్లాడుతూ తన చిన్నతనం నుంచి యానిమేషన్ లో వచ్చే యువరాణి పాత్రలో తనను తాను ఊహించుకునేదాన్నని, ఇప్పుడు అలాంటి పాత్రలో నటించడంతో తన కల నెరవేరిందని చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు గుణశేఖర్ కు ఆమె కృతజ్ఞతలు తెలిపింది.