ఘట్టమనేని ఫ్యాన్స్ ని కొత్త విషయం ఒకటి భయపెడుతుంది. ఒకటికి రెండు సార్లు ఒక విషయం రిపీట్ అవ్వడంతో ఇప్పుడది సెంటిమెంట్ గా మారి మరింత ఎక్కువ ఆలోచించేలా చేస్తోంది. అసలు విషయంలోకి వస్తే మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా ‘గుంటూరు కారం’. సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ జనవరి 12న రిలీజ్ కానున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రెండు సాంగ్స్ బయటకి వచ్చాయి. ఇందులో ఒకటి మాస్ సాంగ్ కాగా ఇంకొకటి మెలోడీ. ఈ రెండు సాంగ్స్ గుంటూరు కారం సినిమా మూడ్ ని తెలిపేలా ఉన్నాయి. ఇదిలా ఉంటే గుంటూరు కారం నుంచి ఫస్ట్ సాంగ్ ‘ధమ్ మసాలా’ నవంబర్ 7న బయటకి వచ్చింది. సెకండ్ సాంగ్ ఓ మై బేబీ డిసెంబర్ 13న రిలీజ్ అయ్యింది. ఇదే డేట్స్ కి త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన అజ్ఞాతవాసి సినిమాలోని పాటలు కూడా రిలీజ్ అయ్యాయి. పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్ మోస్ట్ హైప్డ్ సినిమాగా అజ్ఞాతవాసి తెరకెక్కింది.
అజ్ఞాతవాసి నుంచి ఫస్ట్ సాంగ్ ‘బయటకొచ్చి చూస్తే’ నవంబర్ 7నే రిలీజ్ అయ్యింది. అజ్ఞాతవాసి సినిమాలోని సెకండ్ సాంగ్… గాలి వాలుగా డిసెంబర్ 12న రిలీజ్ అయ్యింది కానీ ఈ సాంగ్ ని పవన్ కళ్యాణ్ కోసం అనిరుధ్ స్పెషల్ గా ట్రిబ్యూట్ వీడియో చేసాడు. ఆ ట్రిబ్యూట్ సాంగ్ డిసెంబర్ 13నే రిలీజ్ అయ్యింది. ఇలా రెండు సినిమాల పాటలు ఒకే డేట్ ని రిలీజ్ అవ్వడంతో రిలీజ్ కూడా అజ్ఞాతవాసి సినిమాలాగే ఉంటుందేమో అనే కామెంట్స్ సోషల్ మీడియాలో స్టార్ట్ అయ్యాయి. సెంటిమెంట్స్ ని ఎక్కువగా నమ్మే ఫిల్మ్ ఇండస్ట్రీలో గుంటూరు కారం సాంగ్ రిలీజ్ డేట్స్ అజ్ఞాతవాసితో మ్యాచ్ అవుతుంటే మేకర్స్ క్రాస్ చెక్ చేసుకోలేదా లేక గుంటూరు కారం సినిమాపై ఉన్న నమ్మకంతో సెంటిమెంట్ ని పట్టించుకోకుండా ప్రమోషన్స్ చేస్తున్నారా అనేది చూడాలి.