బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఒలివియా మోరిస్ నటిస్తుండగా, అలియా భట్ రాంచరణ్ పక్కన నటిస్తోంది. కాగా అలియా ఈ సినిమాతో పాటుగా పలు బాలీవుడ్ చిత్రాలతోను బిజీగా వుంది. అయితే ఈ బ్యూటీ మరోసారి రాంచరణ్ సరసన నటించనున్నట్లు సమాచారం. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్, రాంచరణ్ హీరోగా ఓ పాన్ ఇండియా మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ పనులను జరుపుకుంటోంది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా రష్మిక మందన.. కియారా అద్వాణీ పేర్లు ఇటీవల వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా బాలీవుడ్ భామా అలియా భట్ను హీరోయిన్గా తీసుకోవాలని శంకర్ భావిస్తున్నాడని సమాచారం. చిత్రబృందం కూడా అలియాను కలిసినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ విషయంపై స్పష్టత రావాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే!