యంగ్ హీరో సత్యదేవ్ హీరోగా నటిస్తున్న ‘గాడ్సే’ చిత్రం టైటిల్ తోనే అందరి దృష్టిని ఆకర్షించింది. దర్శకుడు గోపీ గణేష్ పట్టాభి తెరకెక్కిస్తున్న ఈ సినిమా సామాజిక అంశాల చుట్టూ తిరుగుతుంది. తాజాగా ‘గాడ్సే’ టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ట్విట్టర్ లో ఈ టీజర్ లింక్ ను షేర్ చేస్తూ చిరు హీరో సత్యదేవ్, దర్శకుడు గోపి, సినిమా నిర్మాత సి కళ్యాణ్ లను అభినందించారు.
టీజర్ విషయానికొస్తే… 1.18 నిమిషాల నిడివితో ఉన్న ఈ టీజర్ ‘గాడ్సే’ పాత్రలో నటిస్తున్న సత్య దేవ్ అవినీతి రాజకీయాలను అరికట్టాలనే లక్ష్యంతో ఉన్న యువకుడిగా చూపిస్తుంది. ఆయన కోసం అధికారులు గాలిస్తుండగా, ఐశ్వర్య లక్ష్మి విచారణ అధికారి కన్పించింది. ఇక టీజర్ లో “ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకోనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు…” అంటూ టీజర్ స్టార్ట్ కాగా “సాధారణంగా ఉద్యోగం చేస్తే డబ్బులు వస్తాయి, వ్యాపారం చేస్తే డబ్బులు వస్తాయి, వ్యవసాయం చేస్తే డబ్బులు వస్తాయి… కానీ సేవ చేస్తున్నందుకు మీకు వందల వేల లక్షల కోట్లు ఎలా వస్తున్నారా? ఎందుకంటే మీరంతా సర్వీస్ పేరుతో పబ్లిక్ మనీ లూటీ చేస్తున్నారు” అంటూ సత్యదేవ్ ఆవేశంగా ప్రశ్నించడం ఆలోచింపజేస్తుంది. టీజర్లో సునీల్ కశ్యప్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
2018లో విడుదలైన “బ్లఫ్ మాస్టర్” చిత్రంతో విజయం అందుకున్న సత్య దేవ్… నెక్స్ట్ ప్రాజెక్ట్ గా దర్శకుడు గోపీ గణేష్ పట్టాభితో కలిసి ‘గాడ్సే’ ప్రాజెక్ట్ కోసం పని చేస్తున్నారు. ‘గాడ్సే’ను సికె స్క్రీన్స్ బ్యానర్పై సి కళ్యాణ్ నిర్మించారు. నాజర్, సాయాజీ షిండే, కిషోర్, ఆదిత్య మీనన్, బ్రహ్మాజీ, నాగబాబు, పృథ్వీరాజ్, తనికెళ్ళ భరణి వంటి సీనియర్ నటులు సపోర్టింగ్ క్యారెక్టర్స్లో నటిస్తున్నారు. గోపీ గణేష్ పట్టాభి ఈ ప్రాజెక్ట్ కి దర్శకత్వం వహించడంతో పాటు ‘గాడ్సే’కి కథ, స్క్రీన్ప్లే, డైలాగ్స్ కూడా రాశారు.
