చిత్రపురి హౌసింగ్ సొసైటీ ప్రాంగణంలో ప్రముఖ నటులు, స్వర్గీయ డాక్టర్ ఎం. ప్రభాకర్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఆగస్ట్ 15న జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాతలు సి. కళ్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకుడు ఎన్. శంకర్, చిత్రపురి హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్, కోశాధికారి మహానందరెడ్డి, ఫెడరేషన్ సెక్రటరీ పీఎస్ఎన్ దొర, ఇతర కమిటీ సభ్యులు, ప్రభాకర్ రెడ్డి భార్య లక్ష్మి, కుమార్తెలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వల్లభనేని అనిల్ కుమార్ మాట్లాడుతూ ”సినీ కార్మికుల సంక్షేమం కోసం డాక్టర్ ఎం. ప్రభాకర్ రెడ్డి ఎంతో కృషి చేశారు. ఆయన వల్లే ఇవాళ సుమారు నాలుగున్నర వేల కుటుంబాలకు నివాస సౌకర్యం ఏర్పడింది. చిత్రపురి కాలనీలో ప్రభాకర్ రెడ్డి గారి విగ్రహం ఏర్పాటు చేయాలని 4 నెలల కిందటే అనుకున్నాం. కానీ కరోనా పరిస్థితుల వల్ల వాయిదా వేయాల్సి వచ్చింది. ప్రభాకర్ రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా ప్రస్తుత కమిటీ పనిచేస్తోంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా చిత్రపురిలో మిగిలిన నిర్మాణాలను పూర్తి చేస్తాం. ఆ గృహ ప్రవేశాలు జరిగే రోజున ప్రభాకర్ రెడ్డి గారి కాంస్య విగ్రహాన్ని చిత్రపురిలో ఎత్తైన స్థలంలో ఏర్పాటు చేస్తాం” అని తెలిపారు.
దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ”తెలుగు సినీ పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్ రావడానికి ఎక్కువ కృషి చేసింది ప్రభాకర్ రెడ్డి గారే. ఇవాళ తెలుగు సినిమా పరిశ్రమలో కార్మిక యూనియన్లు బలంగా నిలబడ్డాయి అంటే అందుకు ఆయనే కారణం. ఆయన ఎప్పుడూ కార్మికుల సంక్షేమం గురించే ఆలోచించేవారు. గతంలో ఫిల్మ్ నగర్ లో ప్రభాకర్ రెడ్డి గారి విగ్రహం పెట్టాలని ప్రయత్నించాం. కానీ జీహెచ్ఎంసీ అనుమతులు ఇవ్వలేదు. త్వరలో ప్రభాకర్ రెడ్డి గారి కాంస్య విగ్రహం పెడతామని అనిల్ చెప్పడం సంతోషంగా ఉంది” అని అన్నారు.
నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ, ”సినీ కార్మికుల బాగు కోసం ప్రభాకర్ రెడ్డి గారితో పాటు దాసరి నారాయణరావు గారు కూడా చాలా కృషి చేశారు. చిత్రపురి కాలనీలో ప్రభాకర్ రెడ్డి గారితో పాటు, దాసరి గారి విగ్రహాన్ని కూడా పెట్టాలని కోరుతున్నా. నేనే ఆ రెండు విగ్రహాలను డొనేట్ చేస్తాను. వీలైనంత త్వరగా వాటిని ఆవిష్కరించుకుందాం” అని చెప్పారు.