దర్శకుడుగా చేసింది రెండు సినిమాలు, అందులో ఒకటి రిలీజ్ అయి హిట్ అవ్వగా రెండోది ఎప్పుడు వస్తుందో తెలియదు, అయినా వశిష్ట ఇప్పుడు టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్గా మారిపోయారు. ‘బింబిసార’తో తన టేకింగ్ ఏంటో నిరూపించుకున్న ఆయన, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో ‘విశ్వంభర’ వంటి భారీ సోషియో ఫాంటసీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే, వశిష్ట కెరీర్లో ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. ఆయన కొడుకుల కోసం కథలు రాసుకుంటే, అవే కథలు తండ్రుల సినిమాల వైపు నడిపిస్తున్నాయి. అసలు విషయం ఏమిటంటే నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. ఎంతో మంది డైరెక్టర్లు మోక్షజ్ఞ కోసం కధలు రాసుకొన్నారు. అలానే మోక్షజ్ఞ డెబ్యూ కోసం వశిష్ట ఒక అద్భుతమైన కథను సిద్ధం చేశారు. బాలకృష్ణకు కూడా ఆ కథ నచ్చడంతో ప్రాజెక్ట్ దాదాపు ఖరారైందని అందరూ భావించారు కానీ, లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. మోక్షజ్ఞ ప్రాజెక్టును ప్రస్తుతానికి పక్కన పెట్టి, అదే వశిష్ట దర్శకత్వంలో బాలకృష్ణ స్వయంగా ఓ సినిమా చేయబోతున్నారట.
Also Read :Ek Din: సాయి పల్లవి ‘ఏక్ దిన్’ ట్రైలర్.. ఒక్క రోజు ప్రేమ కోసం హీరో పోరాటం!
బాలయ్యకు వశిష్ట చెప్పిన మరో లైన్ విపరీతంగా నచ్చడంతో, ఈ ‘నటసింహం’ ప్రాజెక్ట్ ముందుగా టేకాఫ్ కాబోతోందని సమాచారం. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ ప్రయాణం కూడా ఇలాగే మొదలైంది. మొదట వశిష్ట ఓ కథను రామ్ చరణ్ కోసం రాసుకున్నారు. చరణ్కు కూడా కథ బాగా నచ్చింది. కానీ ఆ డిస్కషన్స్ జరుగుతున్న సమయంలోనే చిరంజీవికి ఒక లైన్ చెప్పడం, అది కాస్తా ‘విశ్వంభర’గా మారి పట్టాలెక్కడం జరిగిపోయాయి. అలా చరణ్ చేయాల్సిన ప్రయాణంలోకి చిరు వచ్చారు. వశిష్ట శైలి, ఆయన విజువలైజేషన్ సీనియర్ స్టార్ హీరోలకు బాగా కనెక్ట్ అవుతున్నట్లు కనిపిస్తోంది. అలా రామ్ చరణ్ కోసం అనుకుంటే.. మెగాస్టార్ చిరంజీవి ప్రాజెక్ట్ ఓకే అయ్యింది, మోక్షజ్ఞ కోసం అనుకుంటే.. ఇప్పుడు బాలయ్య ప్రాజెక్ట్ లైన్లోకి వచ్చింది. మొత్తానికి వశిష్ట రాసుకున్న కథలు వారసుల కంటే ముందుగా వాళ్ల తండ్రులను మెప్పిస్తుండటం ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక క్రేజీ ‘సెంటిమెంట్’గా మారిపోయింది.