ప్రముఖ తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ సైతం నటుడిగా మారిపోయాడు. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా తమిళంలో పలు విజయవంతమైన చిత్రాలను రూపొందించాడు సెల్వరాఘవన్. తెలుగులోనూ వెంకటేశ్ హీరోగా ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ వంటి హిట్ చిత్రాన్ని తెరకెక్కించాడు. సెల్వ రాఘవన్ తమ్ముడు ధనుష్ ఇప్పటికే జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. నిజానికి సెల్వ రాఘవన్ తాను నటుడిగా మారుతున్నట్టు గత యేడాది డిసెంబర్ లోనే ప్రకటించాడు. ‘రాకీ’ ఫేమ్ అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ‘సాని కాయిధమ్’ చిత్రంలో సెల్వ రాఘవన్, కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ గత యేడాది డిసెంబర్ లోనే వచ్చింది. ఫిబ్రవరి 25 గురువారం రోజు తొలిసారి ముఖానికి రంగేసుకుని సెల్వ రాఘవన్ షూటింగ్ లో పాల్గొన్నాడు. ’23 సంవత్సరాలుగా దర్శకుడిగా ఉన్న తాను తొలిసారి నటుడిగా మారానని, ఇదంతా అభిమానుల చలువేనని, వారికి రుణపడి ఉంటాన’ని సెల్వ రాఘవన్ తెలిపాడు. అలానే తన స్టిల్ నూ పోస్ట్ చేశాడు. గతంలో విడుదలైన పోస్టర్ చూస్తే మాత్రం ఇదేదో పోలీస్ విచారణ నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కుతున్న సినిమా అనే భావన ప్రేక్షకులకు కలుగుతోంది. మరి నటుడిగా మారిన ఈ దర్శకుడు ఎలాంటి పేరు తెచ్చుకుంటాడో చూద్దాం.