సుప్రీమ్ హీరో సాయి తేజ్, విలక్షణ దర్శకుడు దేవ్ కట్టా కలయికలో రూపొందిన సినిమా ‘రిపబ్లిక్’. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ అధికారుల పాత్ర ఏమిటి? రాజకీయ నాయకులు ఎలా ఉండాలి? ప్రజలు ఏం చేయాలి? ఏం తెలుసుకోవాలి? అనే వాటిని గురించి తెలియచెప్పిన సినిమా ‘రిపబ్లిక్’. దీనికి థియేటర్లలో మంచి స్పందన లభించింది. అప్పట్లో కరోనా భయాలతో వెళ్లని ప్రేక్షకులు, జీ 5 ఓటీటీ వేదికలో విడుదలైన తర్వాత సినిమాను ఓ ఉద్యమంలా చూస్తున్నారు. ”రిపబ్లిక్’ ఓ మూవీ కాదు, మూమెంట్ అని అంటున్నారు దర్శకుడు దేవ్ కట్టా. నవంబర్ 26న ‘రిపబ్లిక్’ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. ఆ రోజు నుంచి సోషల్ మీడియాలో మూవీ ట్రెండ్ అవుతోంది.
ముఖ్యంగా డైరెక్టర్ కామెంటరీతో సినిమాను విడుదల చేసిన ‘జీ 5’ బృందాన్ని అందరూ అభినందిస్తున్నారు. మన దేశంలో తొలిసారి డైరెక్టర్ కామెంటరీతో విడుదలైన సినిమా కూడా ఇదే. ‘జీ 5’లో విడుదలైన ఏడు రోజుల్లో సినిమాను 12 కోట్ల నిమిషాల పాటు వీక్షకులు చూశారని, ఇదొక రికార్డు అని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. సాయితేజ్ ముందు చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’ సైతం జీ 5 ఓటీటీలో విడుదల అయ్యింది.
