తెలుగువారికి మలయాళం మాట్లాడటం ఎంత కష్టమో! మలయాళీలకు తెలుగు భాష మాట్లాడటమూ అంతే కష్టం. అయితే తొలిసారి తెలుగు సినిమా ‘శాకుంతలం’లో దుష్యంతుడి పాత్ర చేస్తున్న మలయాళ నటుడు దేవ్ మోహన్ మాత్రం ఇష్టపడి, కష్టపడి తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నాడు. సమంత టైటిల్ రోల్ పోషిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’ షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.
చారిత్రక చిత్రం ‘రుద్రమదేవి’ తర్వాత గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ పురాణ గాథను ‘దిల్’ రాజుతో కలిసి, గుణశేఖర్ కుమార్తె నీలిమా నిర్మిస్తోంది. సినిమా షూటింగ్ సమయంలో ఎంత డెడికేషన్ తో అయితే దేవ్ మోహన్ నటించాడో, ఇప్పుడు డబ్బింగ్ సమయంలోనూ అదే అంకిత భావం చూపించి తమను అబ్బురపరిచాడంటూ నిర్మాతలు ‘దిల్’ రాజు, నీలిమా కితాబిచ్చారు. దేవ్ మోహన్ డబ్బింగ్ పనులు పూర్తయ్యానని దిల్ రాజు ఈ రోజు ట్వీట్ చేశాడు. మరి భారీ అంచనాలు నెలకొన్న ‘శాకుంతలం’ చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేసేది మాత్రం నిర్మాతలు ఇంతవరకూ వెల్లడించలేదు.