పాటల సుందరరాముడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సరసాలు పోయిన కలం… నవరసాలు పలికించిన కలం… నీరసాలను దూరం చేసిన కలం… ‘నవ’రసాలను ఊరించిన కలం… ఆ కలం పేరు వేటూరి సుందర రామమూర్తి! పండిత వంశంలో జన్మించిన వేటూర సుందరరాముడు చిత్రసీమలో తనదైన కవితావైభవాన్ని ప్రదర్శించారు. మహాపండితుడు, అన్నమయ్య పదకవితలను లోకానికి తెలియజేయడానికి పూనుకున్న ఘనుడు వేటూరి ప్రభాకర శాస్త్రి. ఆయన సోదరుని తనయుడే వేటూరి సుందర రామమూర్తి. వేటూరి వారింట తలుపును తట్టినా కవిత్వం పలుకుతుందని ప్రతీతి. అలాంటి వంశంలో పుట్టిన కారణంగా బాల్యంలోనే వేటూరికి కవిత్వం అబ్బింది. పెదనాన్న వేటూరి ప్రభాకర శాస్త్రి నేతృత్వంలో పదాలను విరవడం, కలపడం వంటి విన్యాసాలు నేర్చారు. చదువు పూర్తయ్యాక పత్రికారచయితగా జీవనం ఆరంభించారు. వార్తలు రాసే సమయంలోనూ వేటూరి రాసిన పలుకులు పాటలను తలపించేవి. ఇక సినిమా రంగంలో తొలి పాట మొదలు చివరి పాట దాకా వేటూరి గీతవైభవం మరపురానిది మరువలేనిది.
వేటూరి సుందర రామమూర్తిలోని పదవిన్యాసాలు మహానటుడు యన్టీఆర్ ను ఆకర్షించాయి. ఆయన అదే పనిగా వేటూరిని పిలిపించి, చిత్రసీమకు ఆహ్వానించారు. చిత్రవిచిత్రాల చిత్రసీమలో తాను రాణించలేనని వేటూరి దూరం జరిగారు. అయినా పట్టు పట్టి వేటూరితో తన ‘దీక్ష’ చిత్రం కోసం ఓ పాట రాయించారు నందమూరి. అయితే అప్పటికే ఆ సినిమా పాటల పర్వం ముగియడంతో నందమూరికి వేటూరి రాసిన పాట వెలుగు చూడలేదు. ఆ తరువాత వేటూరి ప్రతిభ తెలుసుకున్న కె.విశ్వనాథ్ తన ‘ఓ సీత కథ’లో “భారతనారీ చరితము…” అనే హరికథను రాయించుకున్నారు. ఆ పాటతోనే వేటూరి చిత్రసీమలో ప్రవేశించారు.
Also Read
- NTRNeel : ఎన్టీఆర్ బర్త్డే ‘డబుల్ ధమాకా’.. ‘డ్రాగన్’ గ్లింప్స్.. ఇంకా..!
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Jet Lee OTT Release: సడన్ సర్ప్రైజ్.. ‘జెట్ లీ’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
- Manoj Manchu: మంచు మనోజ్ దంపతుల సంచలన నిర్ణయం.. ఐదుగురు పిల్లల దత్తత!
వేటూరి పదవిన్యాసాల గురించి బోలెడు కథలు చెబుతారు. “పాట రాయకుండా ఎక్కడికి వెళ్ళావయ్యా” అంటూ ‘అడవిరాముడు’ నిర్మాతలు అడిగితే, “ఆ రేసుకు పోయి పారేసుకున్నాను…” అన్నారట. అంతే- అదే పల్లవిగా పాట రాయమని దర్శకుడు కోరడం, అలా “ఆరేసుకోబోయి పారేసుకున్నాను…” పాట వెలుగు చూసింది. ప్రేక్షకులను థియేటర్లలో కుదురుగా కూర్చోనివ్వకుండా చేసింది. ఇక ‘ఆలుమగలు’ నిర్మాత ఏ.వి. సుబ్బారావు “పాట ఎప్పుడిస్తావయ్యా…” అంటే “ఎరక్కపోయి వచ్చాను… ఇరుక్కుపోయాను…” అన్నారట వేటూరి. అదే పాటగా రాయమన్నారు. ఆ పాట కూడా జనానికి పరమానందం పంచింది. యన్టీఆర్ దర్శకత్వంలో రూపొందిన ‘శ్రీమద్విరాటపర్వము’లో బృహన్నల, ఉత్తరకు నాట్యం నేర్పే సమయంలో “ఆడవే హంస గమనా…” అంటూ పల్లవించారు వేటూరి. ఆ చిత్రానికి యన్టీఆర్ నిర్మాత, దర్శకుడు. దాంతో ఆయనకు ఎవరైనా నాట్యకత్తెను ‘మయూరి’తో పోలుస్తారు కదా, మరి వేటూరి వారు ‘హంస’తో పోల్చారే అని అనుకున్నారట. ఆయన సందేహాన్ని వేటూరి ఇలా నివృత్తి చేశారు – “సూర్యగమనాన్ని అనుసరించి మనం కాలాన్ని ‘హంస’లలో కొలుస్తాము… అందుకే ‘ఆడవే హంసగమనా…’ అంటూ కాలానుగుణంగా సాగమని సూచించాను.
ఇక సూర్యకాంతితోనే జాబిల్లి వెలుగుతూ ఉంటుంది. కాబట్టి “నడయాడవే ఇందువదనా…” అని రెండో పంక్తి రాశాను”. వేటూరి కవిచాతుర్యానికి నందమూరి పరమానంద భరితులయ్యారట! ఇక పెదనాన్న ప్రభాకర శాస్త్రి వద్ద నేర్చిన పదవిన్యాసాలను “వాగార్థావివ సంపృక్తౌ.” శ్లోకంలోనూ “వందే పార్వతీపరమేశ్వరౌ…” అంటూ పార్వతీపరమేశ్వరులకు వందనం చేసేలా చేశారు. అదే పదాలను “వందే పార్వతీప…” అంటే పార్వతీపతికి వందనం… “రమేశ్వరౌ…” అంటే రమాపతి విష్ణువుకూ వందనం అన్నట్టుగా విరిచారు. ‘సాగరసంగమం’లో ఈ విన్యాసం పులకింప చేస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే వేటూరి వాణిలో ఒలికిన ముత్యాలెన్నో! వాటిని ఏరుకుంటూనే తెలుగువారు పులకించిపోతూ ఉంటారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ‘నంది’ అవార్డుల్లో ఉత్తమ గీతరచయిత విభాగాన్ని 1977లో ప్రవేశ పెట్టింది. ఆ విభాగంలో ‘పంతులమ్మ’ చిత్రంలోని “మానసవీణ మధుగీతం…” పాటతో తొలి నందిని అందుకున్న ఘనతను సొంతం చేసుకున్నారు వేటూరి. మొత్తం ఆరు సార్లు నంది అవార్డుల్లో ఉత్తమ గీతరచయితగా నిలిచారు సుందరరామమూర్తి. శ్రీశ్రీ రాసిన ‘తెలుగువీర లేవరా…’ (అల్లూరి సీతారామరాజు)తోనే జాతీయ స్థాయిలో ఉత్తమ గీతంగా తెలుగుపాటకు పట్టాభిషేకం జరిగింది. ఆ తరువాత దాదాపు 17 ఏళ్ళకు ‘మాతృదేవోభవ’ చిత్రానికి వేటూరి రాసిన “రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే…” పాటకే జాతీయ అవార్డు లభించింది. ప్రభుత్వ అవార్డులే కాదు వేటూరి పాటలకు ప్రజల రివార్డులు ఎన్నెన్నో లభించాయి. ఆయన పాటలతోనే పలు చిత్రాలపై వసూళ్ళ వర్షం కురిసింది. ఆయన పాటలతోనే నాటి వర్ధమాన కథానాయకులు ‘తారాపథం’ చూడగలిగారు. ఇలా చెప్పుకుంటూ పోతే వేటూరి పాటల మహత్తుతో వెలిగిన వైభవాలు అనేకం కనిపిస్తాయి. అందుకే తెలుగు మాట ఉన్నంత వరకు వేటూరి పాట కూడా వెలుగొందుతూనే ఉంటుందని చెప్పవచ్చు. వేటూరి స్ఫూర్తితోనే ఎందరో వర్ధమాన గీత రచయితలు తమ భవితకు బంగారు బాటలు వేసుకుంటున్నారు.
వేటూరి సుందరరామ మూర్తి కవితావైభవాన్ని గురించి ఎంత చెప్పుకున్నా కొంతే అవుతుంది.ఆ వైభవంలోకి ఒకసారి తొంగి చూస్తే చాలు మనసు ఉప్పొంగి పోతుంది. జీవితం సప్తసాగర తీరం అన్న సత్యమూ బోధ పడుతుంది. వేటూరి పాటలతో సాగితే జీవితంలోని మధురమూ అర్థమవుతుంది. జీవనపోరాటం చేసే సత్తా చేకూరుతుంది. అందుకే తెలుగువారికి వేటూరి పాట ఓ వరం.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..