Vedant Madhavan: స్టార్ హీరోల వారసులు అంటే సాధారణంగా వెండితెరపై ఎంట్రీ ఇవ్వడానికే మొగ్గు చూపుతారు. అయితే అందుకు పూర్తి భిన్నంగా, తండ్రి ఇమేజ్తో ఏమాత్రం సంబంధం లేకుండా తనకంటూ సరికొత్త దారిని ఎంచుకుని దేశానికే గర్వకారణంగా మారాడు ప్రముఖ నటుడు ఆర్.మాధవన్ తనయుడు వేదాంత్ మాధవన్. ఈత కొలనులో ఇప్పటికే అంతర్జాతీయ రికార్డులను తిరగరాసిన ఈ యువ సంచలనం, ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘20వ ఏషియన్ గేమ్స్-2026’ బరిలోకి దిగుతున్నాడు. స్విమ్మింగ్ పూల్లో రేసు కోసం ఏకాగ్రతతో సిద్ధమవుతున్న వేదాంత్ ఫొటోను మాధవన్ తాజాగా సోషల్ మీడియాలో పంచుకోగా, అది క్షణాల్లో వైరల్గా మారింది. ఫ్రీస్టైల్ స్విమ్మర్గా భారత్ తరఫున అద్భుతాలు సృష్టిస్తున్న వేదాంత్ ఖాతాలో ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ పతకాలున్నాయి. మలేషియన్ ఓపెన్లో ఏకంగా ఐదు స్వర్ణ పతకాలు కొల్లగొట్టి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన అతడు.. డానిష్ ఓపెన్లో స్వర్ణం, రజతం కైవసం చేసుకున్నాడు. అలాగే లాత్వియన్, థాయ్లాండ్ ఓపెన్ టోర్నీలలో కాంస్యాలు గెలుచుకోవడంతో పాటు కామన్వెల్త్ యూత్ గేమ్స్లో ఐదో స్థానంలో నిలిచి సత్తా చాటాడు.
భారత స్విమ్మింగ్ విభాగంలో సరికొత్త ఆశలు రేపుతున్న అత్యుత్తమ యువ క్రీడాకారుల్లో వేదాంత్ ఒకడని సాక్షాత్తూ అధికారిక ఒలింపిక్స్ వెబ్సైట్ ప్రశంసల వర్షం కురిపించడం విశేషం. ఓ స్టార్ యాక్టర్ కొడుకుగా విలాసవంతమైన జీవితాన్ని గడపడం కంటే, క్రీడాకారుడిగా తనకంటూ ఓ సొంత గుర్తింపును తెచ్చుకోవడమే తన జీవిత ఆశయమని వేదాంత్ గతంలోనే స్పష్టం చేశాడు. తాను సాధించే విజయాలు తన సొంత కష్టార్జితం కావాలని, తోటి అథ్లెట్లు తనను కేవలం ఒక స్విమ్మర్గా గుర్తించి గౌరవించే స్థాయికి చేరడమే తన లక్ష్యమని గట్టిగా నమ్ముతున్నాడు. తన వెండితెర ప్రయాణం కంటే, కొడుకు ఎంచుకున్న క్రీడా రంగమే తనకు అత్యంత ప్రాధాన్యమని మాధవన్ పలు సందర్భాల్లో గర్వంగా చెప్పుకొచ్చారు. కోట్ల రూపాయల రెమ్యునరేషన్లు, స్టార్ డమ్ కంటే కూడా దేశ జెండాను రెపరెపలాడిస్తున్న కొడుకు ఘనతే తనకు కొండంత సంతృప్తిని ఇస్తుందని చాటిచెప్పారు. ఇప్పుడు ఏషియన్ గేమ్స్ వంటి మెగా ఈవెంట్లో దేశం తరఫున పతకం సాధించేందుకు వేదాంత్ కఠోర సాధన చేస్తుండటంతో, యావత్ భారతావని అతనికి శుభాకాంక్షలు తెలుపుతోంది.

