దాదాపు 46 ఏళ్ల తర్వాత ఇండియన్ సినిమా లెజెండ్స్ సూపర్స్టార్ రజినీకాంత్, ఉలగనాయగన్ కమల్ హాసన్ ఒకే స్క్రీన్పై కనిపించబోతున్నారనే వార్త ‘KHxRK’ అనౌన్స్మెంట్ గ్లింప్స్తోనే ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో కీలకమైన పాత్ర కోసం త్రిషను సంప్రదించగా, ఆమెకు ఏకంగా రూ. 12 కోట్ల భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే, తాజా సమాచారం ప్రకారం త్రిష ఈ మెగా ప్రాజెక్ట్కు నో చెప్పినట్లు కోలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
త్రిష ఈ ప్రాజెక్ట్ వదులుకోవడానికి గల కారణాలపై సోషల్ మీడియాలో ప్రధానంగా పొలిటికల్ యాంగిల్ వినిపిస్తోంది. ఈ సినిమాను ఉదయనిధి స్టాలిన్కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ‘రెడ్ జెయింట్ మూవీస్’ కమల్ హాసన్తో కలిసి నిర్మిస్తోంది. ప్రస్తుత తమిళనాడు రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. అధికార పక్షంలో ఉన్న డీఎంకే (DMK) కి వ్యతిరేకంగా, కొత్త పార్టీ పెట్టి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన సీఎం విజయ్కు త్రిష అత్యంత ఆప్తురాలిగా, మద్దతుదారుగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో, భవిష్యత్తులో రాజకీయంగా ఎలాంటి వివాదాలు తలెత్తకుండా ఉండటానికి, ప్రతిపక్షంలో ఉన్న ఉదయనిధి సంస్థ నిర్మించే సినిమాలో భాగం కావద్దని సీఎం విజయ్.. త్రిషకు ముందుజాగ్రత్తగా సూచించారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. తన స్నేహితుడు విజయ్ మాటను గౌరవించి, ఆమె రూ. 12 కోట్ల ఆఫర్ను కూడా పక్కన పెట్టిందని పుకార్లు షికారు చేస్తున్నాయి.
అంతే కాదు గతంలో కమల్ హాసన్ సరసన త్రిష హీరోయిన్గా నటించిన ‘మన్మథబాణం’, ‘చీకటిరాజ్యం’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాలను అందుకోలేదు. అలాగే ఇటీవల మణిరత్నం-కమల్ కాంబోలో వచ్చిన ‘థగ్ లైఫ్’ చిత్రానికి కూడా మిశ్రమ సెంటిమెంట్స్ ఉండటంతో, కమల్తో కంటిన్యూస్ ఫ్లాప్ సెంటిమెంట్ను బ్రేక్ చేయలేక కూడా ఆమె ఈ లైనప్ నుండి తప్పుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం త్రిష సూర్య సరసన నటించిన ‘వీరభద్రుడు’ (కరుప్పు) ఘనవిజయం సాధించగా.. టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి పక్కన ‘విశ్వంభర’ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ భారీ మల్టీస్టారర్ తిరస్కరణ వార్తలపై త్రిష లేదా ‘రెడ్ జెయింట్ మూవీస్’ అధికారికంగా స్పందించాల్సి ఉంది.
