Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ భేటీ.. పర్సంటేజ్ గొడవకు ముగింపు పలికినట్లేనా?

Deputy Cm Pawan Kalyan

Deputy Cm Pawan Kalyan

Pawan Kalyan: సినీ పరిశ్రమలో గత కొన్ని రోజులుగా నడుస్తున్న ‘సింగిల్ థియేటర్ల పర్సంటేజ్ వివాదం’ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వద్దకు చేరింది. రాజమండ్రి పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లు మంగళవారం అత్యవసరంగా కలుసుకున్నారు. స్థానిక షెల్టన్ హోటల్‌లో ఈ కీలక సమావేశం జరిగింది. సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభ పరిస్థితులపై చర్చించేందుకు పలువురు అగ్ర నిర్మాతలు రాజమండ్రి తరలివచ్చారు. పవన్ కళ్యాణ్‌ను కలిసిన వారిలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సూర్యదేవర నాగవంశీ, మైత్రీ మూవీ మేకర్స్ వై.రవిశంకర్, ప్రముఖ నిర్మాత కిలారి సతీష్‌తో పాటు పలువురు ఇండస్ట్రీ పెద్దలు ఉన్నారు.

భేటీ వెనుక అసలు కారణం ఇదే..
తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలకు, డిస్ట్రిబ్యూటర్లు – నిర్మాతలకు మధ్య పర్సంటేజ్ షేరింగ్ విషయంలో తీవ్ర వివాదం నడుస్తోంది. ఈ ఇష్యూ కారణంగా ఇండస్ట్రీలో తలెత్తిన తాజా పరిస్థితులను, ఎదురవుతున్న ఇబ్బందులను నిర్మాతలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కూలంకషంగా వివరించారు. థియేటర్ల వ్యవస్థను కాపాడుకుంటూనే, అటు నిర్మాతలకు నష్టం రాకుండా ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం చూపాలంటూ నిర్మాతలు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌కు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పరంగా ఈ వివాదంలో జోక్యం చేసుకుని సమస్య సద్దుమణిగేలా చూడాలని వారు డిప్యూటీ సీఎంను కోరారని టాక్. సినిమా ఇండస్ట్రీ సమస్యలపై డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న ఈ సింగిల్ థియేటర్ల వివాదంపై పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.