Telangana Exhibitors : టాలీవుడ్ స్టార్ హీరోలు, నిర్మాతలకు అల్టిమేటం!

Theatres

తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు ఓ కొత్త రచ్చ మొదలైంది. దశాబ్దాలుగా సామాన్యుడికి సినిమాను చేరువ చేస్తూ, టాలీవుడ్ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన ‘సింగిల్ స్క్రీన్’ థియేటర్ల మనుగడ ఇప్పుడు తీవ్ర ప్రమాదంలో పడింది. రోజుల తరబడి థియేటర్ల నిర్వహణ భారంగా మారుతుండటంతో, తెలంగాణ ఎగ్జిబిటర్ల సంఘం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి నేరుగా టాలీవుడ్ స్టార్ హీరోలు, నిర్మాతలకు ఒక సంచలన విజ్ఞప్తి చేసింది. పాత అద్దె విధానానికి స్వస్తి పలికి, తక్షణమే ‘పర్సంటేజ్ షేరింగ్’ విధానాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో థియేటర్లు మూసుకోవడం తప్ప వేరే దారి లేదని తేల్చి చెప్పారు. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా డిస్ట్రిబ్యూటర్లు లేదా నిర్మాతలు అద్దె వసూలు చేసే విధానం ఇప్పుడు సింగిల్ స్క్రీన్ యజమానులకు ఉరితాడులా మారింది. సినిమా ఫ్లాప్ అయినా, థియేటర్ నిర్వహణ ఖర్చులు, కరెంటు బిల్లులు, అద్దెలు కట్టుకోలేక యజమానులు అప్పుల పాలవుతున్నారు. లాభనష్టాలను సమానంగా పంచుకునే ‘పర్సంటేజ్ విధానం’ అయితేనే సింగిల్ స్క్రీన్లు బతుకుతాయని వారు స్పష్టం చేస్తున్నారు.

పెద్ద సినిమాలకే ఎందుకంత పంతం?**
ఏడాదిలో దాదాపు 40 వారాల పాటు చిన్న, టైర్-2 సినిమాలకు నిర్మాతలు పర్సంటేజ్ విధానాన్ని అంగీకరిస్తున్నారు. కానీ, పండుగ సీజన్లలో వచ్చే స్టార్ హీరోల సినిమాలకు (మిగిలిన 10 వారాలు) మాత్రం కచ్చితంగా అద్దె కట్టాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఈ విధానం మార్చుకోవాలని, ఏడాది పొడవునా పర్సంటేజ్ సిస్టమ్ నే అమలు చేయాలని ఎగ్జిబిటర్లు కోరుతున్నారు. ఒకప్పుడు వంద రోజులు, యాభై రోజులు ఆడిన సినిమాలు ఇప్పుడు లేవు. ఉదాహరణకు కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన ‘ఎఫ్ 2’ (F2) లాంటి సినిమా 8 వారాల పాటు థియేటర్లలో సందడి చేసింది. కానీ ఇటీవలి కాలంలో ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ప్రేక్షకులు ఒకేసారి ఎక్కువ థియేటర్లలో సినిమా చూసేస్తున్నారు. దీంతో ‘ధురంధర్’ లాంటి భారీ అంచనాల సినిమాలు సైతం కేవలం రెండు, మూడు వారాలకే థియేటర్ల నుంచి వెళ్లిపోతున్నాయి. ఇలాంటి తరుణంలో భారీ అద్దెలు కట్టడం ఏ రకంగా న్యాయమని వారు ప్రశ్నిస్తున్నారు.

మల్టీప్లెక్స్ లకు ఒక న్యాయం.. మాకో న్యాయమా?
బడా కార్పొరేట్ సంస్థలు నడిపే మల్టీప్లెక్స్ లకు నిర్మాతలు పర్సంటేజ్ విధానాన్ని అమలు చేస్తున్నారు కానీ అదే స్థాయిలో కలెక్షన్లు రాబడుతున్న సింగిల్ స్క్రీన్లకు మాత్రం ఆ అవకాశం ఇవ్వడం లేదు. ముఖ్యంగా ‘పుష్ప’ లాంటి పాన్ ఇండియా హిట్ సినిమాకు పక్క రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్లకు పర్సంటేజ్ విధానం అమలు చేశారు. కానీ మన సొంత తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జిబిటర్లకు ఆ అవకాశం దక్కకపోవడం శోచనీయం. కోవిడ్ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పాత అద్దె విధానాన్ని మోయడం ఎగ్జిబిటర్ల వల్ల కావడం లేదు. పర్సంటేజ్ సిస్టమ్ వైపు అడుగులు వేయడం పరిశ్రమకు ఒక సహజమైన, అవసరమైన పరిణామం అని ఎగ్జిబిటర్ల సంఘం చెబుతోంది. రిస్క్, రివార్డ్ రెండింటినీ సమానంగా పంచుకుంటేనే ఇండస్ట్రీ బాగుంటుందని, సింగిల్ స్క్రీన్ మ్యాజిక్ ను కాపాడుకోవడానికి స్టార్ హీరోలు, నిర్మాతలు పెద్ద మనసుతో తమకు మద్దతు ఇవ్వాలని తెలంగాణ ఎగ్జిబిటర్ల సంఘం కోరుతోంది.