Sujeeth: సైలెంట్‌గా పని కానిచ్చేస్తున్న స్టార్ డైరెక్టర్..

Nani Sujeeth

Nani Sujeeth

Sujeeth: ఓజీ చిత్రంతో ప్రేక్షకులను, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులను ఉర్రూతలూగించిన డైరెక్టర్ సుజీత్. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకున్న ఈ చిత్రం పవర్ స్టార్ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రాల్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఇటీవల ‘ఓజీ 2’ (OG2)పై సోషల్ మీడియాలో సరికొత్త చర్చ మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే డైరెక్టర్ సుజీత్ – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఓజీ 2 స్టోరీపై చర్చలు జరిగిన సంగతి కూడా తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ చిత్రం మేకర్స్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చారు. అయితే సుజీత్ ఎలాంటి హంగామా లేకుండా సైలెంట్‌గా తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ‘బ్లడీ రోమియో’ పనుల్లో పూర్తిగా బిజీగా ఉన్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఓజీ 2 అఫీషియల్ అనౌన్స్‌మెంట్ తర్వాత సుజీత్ ప్రస్తుతం తన పూర్తి దృష్టిని నాని హీరోగా తెరకెక్కనున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పైనే పెట్టినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. గతంలోనే ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయని తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించిన కీలక సాంకేతిక బృందాన్ని ఖరారు చేసే పనిలో సుజీత్ నిమగ్నమయ్యారని, షూటింగ్ కోసం అవసరమైన ప్రధాన లొకేషన్లను కూడా ఫైనల్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన మేజర్ షూటింగ్ లండన్‌లో జరగనున్నట్లు, దానికి సంబంధించిన లోకేషన్స్‌ను కూడా ఇప్పటికే ఆయన ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ పనులను కూడా డైరెక్టర్ సుజీత్ స్టార్ట్ చేయించి .. ఇప్పటికే రెండు ట్యూన్‌లను కూడా లాక్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇక హీరో నాని షూటింగ్‌లో పాల్గొనేందుకు అందుబాటులోకి రావడమే ఆలస్యమని, వెంటనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేలా ప్లానింగ్ జరుగుతోందని తెలుస్తోంది. ఇదే సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో తెరకెక్కించబోయే ‘ఓజీ 2’ విషయంలో కూడా సుజీత్ తన ప్రణాళికలను కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా సంబంధించి సెప్టెంబర్ 2న ఏదైనా కంటెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియాలో ప్రచారం కూడా జరుగుతోంది.