సల్మాన్ ఖాన్ ‘దబాంగ్’ సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సోనాక్షి సిన్హా. పరిశ్రమకు వచ్చి 15 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ బ్యూటీ, ప్రస్తుతం సినిమాల ఎంపికలో రూట్ మార్చారు. త్వరలో విడుదల కానున్న ‘సిస్టమ్’ చిత్రంలో ఆమె నటి జ్యోతికతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రమోషన్లలో భాగంగా మాట్లాడిన సోనాక్షి, నేటి సమాజంలో ఒక నిజాయతీ గల కథను తెరపైకి తీసుకురావడం ఎంత కష్టంగా మారిందో చెప్తూ ఇండస్ట్రీపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తన రాబోయే చిత్రం ‘సిస్టమ్’ గురించి సోనాక్షి మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో నేను ‘నేహా రాజ్వంశ్’ అనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ (లాయర్) పాత్రలో కనిపిస్తాను. తన విలువల కోసం, న్యాయం కోసం గట్టిగా నిలబడే ఒక పవర్ఫుల్ మహిళా న్యాయవాది క్యారెక్టర్ అది. నా కెరీర్లో ఇప్పటివరకు లాయర్ పాత్ర చేయలేదు, అందుకే కోర్టు సీన్లలో నటించడం నాకు చాలా కొత్త అనుభూతిని ఇచ్చింది. ఇక సౌత్ స్టార్ యాక్ట్రెస్ జ్యోతికతో కలిసి నటించడం ఒక అద్భుతమైన అనుభవం. ఆమె లాంటి సీనియర్ నటితో స్క్రీన్ షేర్ చేసుకోవడం వల్ల నాలోని నటనను మరింత మెరుగుపరుచుకునే అవకాశం దొరికింది” అని చెప్పారు.
చిత్ర పరిశ్రమలో క్రియేటివ్ ఫ్రీడమ్ (సృజనాత్మక స్వేచ్ఛ) తగ్గిపోవడంపై సోనాక్షి ఆవేదన వ్యక్తం చేశారు.. ‘ప్రస్తుత కాలంలో ఒక కథను నిజాయతీగా చెప్పడం చాలా కష్టంగా మారిపోయింది. గతంలో ఉన్నంత స్వేచ్ఛ ఇప్పుడు మేకర్స్కు లేదు. సమాజంలోని చేదు నిజాలను, లోపాలను నిక్కచ్చిగా చూపాలంటే భయపడాల్సిన వాతావరణం ఉంది. అందుకే వివాదాలు రాకూడదనే ఉద్దేశంతో దర్శకనిర్మాతలు చాలా జాగ్రత్తగా సేఫ్ సబ్జెక్ట్స్ను ఎంచుకుంటున్నారు. కొన్ని ప్రాజెక్టులు నాకు పశ్చాత్తాపాన్ని, పీడకలలను మిగిల్చాయి. కథ బాగుందని నమ్మి సైన్ చేస్తాం, కానీ షూటింగ్ సమయంలో పరిస్థితులు మారిపోయి సినిమా వేరేలా రూపుదిద్దుకుంటుంది. అప్పుడు ‘అసలు ఈ సినిమా ఎందుకు ఒప్పుకున్నానా?’ అని తీవ్ర అసంతృప్తితో మదనపడ్డాను. అక్కడ ఉండాలనిపించకపోయినా, ఒప్పుకున్న పనిని పూర్తి చేసి ముందుకు సాగడమే నా పద్ధతి. జీవితంలో ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు, నేనూ చేశాను.. వాటి నుండి నేర్చుకుని ముందుకు వెళ్ళిపోవడమే’ ముఖ్యం అని తెలిపింది సోనాక్షి సిన్హా.
అలాగే పరిశ్రమలో వచ్చిన మార్పులపై స్పందిస్తూ.. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో సోషల్ మీడియా ప్రభావం ఇంతలా లేదు. అందుకే నేను చాలా మంచి టైంలో ఇండస్ట్రీకి వచ్చాననిపిస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియా వల్ల ఇండస్ట్రీ మొత్తం మారిపోయింది. నేను కెరీర్ ప్రారంభించినప్పుడు అక్షరాలా ఒక పసిపాపను. కానీ ఈ 15 ఏళ్ల అనుభవం, పరిస్థితులు నన్ను ఒక మెరుగైన వ్యక్తిగా, సరైన నిర్ణయాలు తీసుకునేలా తీర్చిదిద్దాయి’ అని సోనాక్షి సిన్హా ముగించారు.
