టాలీవుడ్ క్లాసిక్ మేకర్, లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు 94 ఏళ్ల వయసులో అందించిన సరికొత్త అద్భుతం ‘సింగ్ గీతం’. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లపై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 12న విడుదలై థియేటర్ల వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమాలో ప్రతి డైలాగ్ను పాడుతూ చెప్పే సరికొత్త ప్రయోగాన్ని టాలీవుడ్కు పరిచయం చేశారు సింగీతం. ఈ సందర్భంగా ఆయన నటీనటుల ఎంపిక, స్టార్ హీరోల నటనా శైలిపై పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
సినీ చరిత్రలో కమల్ హాసన్, డా. రాజ్కుమార్, నందమూరి బాలకృష్ణ లాంటి ఎందరో మహానటులతో పనిచేసిన అనుభవంపై సింగీతం స్పందించారు. “పరిశ్రమలో ప్రతి నటుడికి తనదైన ఒక ప్రత్యేక శైలి, వ్యక్తిత్వం ఉంటాయి. బాలకృష్ణ గారు కమల్ హాసన్ గారిలా ఉండరు.. అలాగే కమల్ హాసన్ గారు కన్నడ లెజెండ్ డా. రాజ్కుమార్ గారిలా నటించరు. ముగ్గురూ అసాధారణమైన ప్రతిభావంతులే అయినప్పటికీ, వారి యాక్టింగ్ స్టైల్స్ పూర్తిగా భిన్నం. ఒక దర్శకుడిగా నా బాధ్యత ఏంటంటే.. ఏ నటుడిలో ఉన్న ప్రత్యేకతను ఆ నటుడి నుంచే అత్యుత్తమంగా రాబట్టడం. ఒకరి శైలిని మరొకరిపై రుద్దకుండా, వారిలోని ఒరిజినల్ టాలెంట్ను వెండితెరపై ప్రెసెంట్ చేయడమే నా సినిమాల విజయానికి ప్రధాన కారణం” అని ఆయన స్పష్టం చేశారు.
‘సింగ్ గీతం’లో ఎక్కువగా కొత్త నటీనటులను తీసుకోవడం వెనుక ఉన్న అసలు రహస్యాన్ని సింగీతం బయటపెట్టారు. “ఈ సినిమా మ్యూజికల్ డ్రామాగా సాగుతుంది కాబట్టి కాస్టింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఈ చిత్రంలో నటించిన ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండెపూడి వంటి ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు సంబంధించిన పాటలను, సంభాషణలను స్వయంగా పాడుకున్నారు. సాధారణ సినిమాల్లా ఇక్కడ ప్లేబ్యాక్ సింగర్స్ లేరు. ఇక్కడ నటించిన వారే గాయకులు కూడా అయ్యారు. పాత్రలోని భావాలను నటీనటులు స్వయంగా ఆలపించడం వల్లే సినిమాకు ఇంతటి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది” అని లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఆనందం వ్యక్తం చేశారు. రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన స్వరాలు ఈ ప్రయోగాన్ని మరింత రక్తికట్టించాయి.

