సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘జటాధర’. ఒక సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. నవంబర్ 7న తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంతో సీనియర్ నటి శిల్పా శిరోధ్కర్ చాలా కాలం తర్వాత తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ సందర్భంగా ఆమె సినిమా విశేషాలను పంచుకున్నారు.
Also Read:Tollywood Producers: మునగచెట్టు ఎక్కించి వాళ్ళపై నిందలు ఎందుకు?
చాలా ఏళ్ల క్రితం వచ్చిన ‘బ్రహ్మ’ సినిమా తర్వాత మళ్లీ తెలుగులో నటించడం చాలా ఆనందంగా ఉందని శిల్పా తెలిపారు. “ఈ చిత్రంలో నేను ‘శోభ’ అనే పాత్రలో కనిపిస్తాను. డబ్బుపై విపరీతమైన ఆశ, ఎలాగైనా ధనవంతురాలు కావాలనే తపన ఉన్న పాత్ర ఇది. ఇలాంటి పాత్ర నేను ఇంతకుముందు చేయలేదు, అందుకే చాలా సవాలుగా అనిపించింది. దర్శకుల స్పష్టమైన విజన్, వారి మద్దతుతో ఈ పాత్రను పోషించగలిగాను. ఈ సినిమాతో రీఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉంది,” అని అన్నారు.
హీరో సుధీర్ బాబు గురించి మాట్లాడుతూ, “ఆయనతో పనిచేయడం ఒక మంచి అనుభవం. ఈ తరం నటుల నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. సుధీర్ బాబు చాలా అంకితభావంతో పనిచేశారు. ఆయన మాకు బంధువు అయినప్పటికీ, సెట్లో మేమిద్దరం చాలా ప్రొఫెషనల్గా నటులుగానే ఉన్నాము,” అని చెప్పారు. అలాగే, “మా ట్రైలర్ను మహేష్ బాబు గారు విడుదల చేయడం, నన్ను ఇండస్ట్రీకి తిరిగి స్వాగతించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది,” అని శిల్పా పేర్కొన్నారు.
Also Read:Sreeleela : నేను శ్రీదేవిని కాదు.. నా బాడీ టైప్ నాకు తెలుసు – శ్రీలీల
‘బ్రహ్మ’ సమయానికి, ఇప్పటికీ తెలుగు పరిశ్రమలో ఎన్నో మార్పులు వచ్చాయని శిల్పా అభిప్రాయపడ్డారు. “టాలీవుడ్ ఇప్పుడు కంటెంట్ పరంగా, సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందింది. ప్రస్తుతం తెలుగు సినిమా ఒక ఉత్తమ దశలో ఉంది,” అని ఆమె అన్నారు. ‘జటాధర’ గురించి చెబుతూ, “ఇది అద్భుతమైన విజువల్స్, బలమైన భావోద్వేగాలు, మంచి సంగీతం ఉన్న సూపర్ నేచురల్ థ్రిల్లర్. ప్రేక్షకులకు ఖచ్చితంగా ఒక గొప్ప అనుభూతిని ఇస్తుంది,” అని హామీ ఇచ్చారు.
దర్శకులు వెంకట్, అభిషేక్లకు నటీనటుల నుంచి ఏం కావాలో స్పష్టంగా తెలుసని, నిర్మాతలు ఉన్నతమైన నిర్మాణ విలువలతో సినిమాను నిర్మించారని ప్రశంసించారు. “ట్రైలర్ విడుదలయ్యాక తెలుగు, హిందీ ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. నవంబర్ 7న అందరూ ఒక అద్భుతమైన చిత్రాన్ని చూడబోతున్నారు,” అని శిల్పా శిరోధ్కర్ ముగించారు.
