కరోనా మహమ్మారి, లాక్డౌన్ కారణంగా సినిమా థియేటర్లకు భారీ నష్టం వాటిల్లింది. సినిమాల షూటింగులు, విడుదలలు సైతం ఆగిపోయాయి. అయితే ఇలాంటి సమయంలోనే ఓటిటి ప్లాట్ఫామ్ లు ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ను అందిస్తూ చిత్రనిర్మాతలకు కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే తెలుగులో అల్లు అరవింద్ ఓటిటి వేదిక ‘ఆహా’ తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ తరుణంలోనే మరో ఓటిటి సంస్థ లాంచ్ అవ్వబోతోంది. బ్రాండ్ న్యూ ఓటిటి ‘స్పార్క్’ ఓటిటి మే 15న లాంచ్ కాబోతోంది. ‘స్పార్క్’ యూకే ఆధారిత ఇంక్రివెల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఒక యూనిట్. ఇప్పుడు భారతీయ ఓటిటి మార్కెట్లోకి ప్రవేశిస్తోంది. యువ పారిశ్రామికవేత్త సాగర్ మాచనూరు ‘స్పార్క్’ను భారీ ఎత్తున లాంచ్ చేయనున్నారు. ఇందులో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలోని కంటెంట్ను అందించనున్నారు. నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అంటున్నారు ‘స్పార్క్’ నిర్వాహకులు. సాగర్ మాచనూరు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘ఆర్జీవీ వరల్డ్ థియేటర్’ సహకారంతో ‘స్పార్క్’ ఓటిటి ప్లాట్ఫామ్ను పరిచయం చేశారు. ఆర్జీవీ నుండి వచ్చే అన్ని సినిమాలు ప్రత్యేకంగా ‘స్పార్క్’ ఓటిటిలో విడుదల కానున్నాయి. ఆర్జివి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘డి కంపెనీ’ మే 15 నుండి ‘స్పార్క్’లో ప్రసారం అవుతుంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకధీరుడు రాజమౌళి ‘స్పార్క్’ టీంకు విషెష్ తెలపడం విశేషం.