Sujatha Vijayakumar: తమిళ హీరో రవి మోహన్, ఆయన భార్య ఆర్తి రవి విడాకుల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారంలో ఆర్తి రవి తల్లి, ప్రముఖ నిర్మాత సుజాత విజయ్కుమార్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. రవి మోహన్ నుంచి నెలకు రూ.40 లక్షల మెయింటెనెన్స్ను ఎలాంటి కారణం లేకుండా కోరలేదని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కుటుంబ ఆర్థిక పరిస్థితులు, పిల్లల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకునే ఈ డిమాండ్ చేసినట్లు తెలిపారు. గత రెండేళ్లుగా పిల్లల స్కూల్ ఫీజులు, ఆహారం, ట్యూషన్, ఇతర ఖర్చులకు సరైన ఆర్థిక సహాయం అందలేదని పేర్కొన్నారు. ఇంటికి ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి నోటీసు వచ్చిన పరిస్థితి కూడా ఎదురైందని వెల్లడించారు.
పిల్లలు ఫస్ట్ క్లాస్ నుంచే అమెరికన్ స్కూల్లో చదువుతున్నారని, ఇది ఇద్దరు తల్లిదండ్రులు కలిసి తీసుకున్న నిర్ణయమని చెప్పారు. వారి ఏడాది స్కూల్ ఫీజులు సుమారు రూ.86 లక్షలు ఉంటాయని, ఈ స్కూల్ ఫీజులను చెల్లించాలని కోర్టు ఆదేశించినట్లు తెలిపారు. రవి మోహన్ పిల్లలను కలవకుండా తాము ఎప్పుడూ అడ్డుకోలేదని సుజాత స్పష్టం చేశారు. పిల్లలను కలిసేందుకు విజిటేషన్ రైట్స్ కోసం తామే కోర్టును ఆశ్రయించామని, ఆగస్టు నుంచి ప్రతి శని, ఆదివారాల్లో వారిని కలిసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అలాగే కుటుంబ విషయాలను బహిరంగంగా తీసుకురావడం ఎవరికీ మంచిది కాదని, ముఖ్యంగా పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోవాలని అభిప్రాయపడ్డారు. ఆర్తి తన కుటుంబాన్ని తిరిగి ఒక్కటి చేసుకోవాలనే ఉద్దేశంతోనే పోరాడుతున్నారని తెలిపారు. తాను నిర్మాతగా స్వతంత్రంగా ఎదిగానని, రవి మోహన్ సినిమాల్లో రూ.100 కోట్ల వరకు పెట్టుబడి పెట్టినట్లు సుజాత వెల్లడించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రవి మోహన్ – ఆర్తి విడాకుల వ్యవహారంలో మరోసారి చర్చకు దారితీశాయి.

