Vijay Deverakonda : రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పిరియాడిక్ యాక్షన్ మూవీ ‘రణబాలి’. ఈ చిత్రంపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగింది. దసరా బరి నుంచి రణబాలి తప్పుకుందని, సినిమా డిసెంబర్కు వాయిదా పడిందంటూ వచ్చిన వార్తలు రౌడీ ఫ్యాన్స్ను తీవ్ర గందరగోళానికి గురిచేశాయి. అయితే వాటన్నింటికీ చెక్ పెడుతూ తాజాగా చిత్ర యూనిట్ అదిరిపోయే అప్డేట్తో ముందుకొచ్చింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ను రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఈ రోజుతో అధికారికంగా పూర్తి చేశారు. నేటితో గుమ్మడికాయ కొట్టేసి, అనుకున్న డేట్కే థియేటర్లలో దిగుతున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు.
‘టాక్సీవాలా’ వంటి సూపర్ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న చిత్రం కావడంతో పాటు, ఇటీవల విడుదలైన గ్లింప్స్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. దసరా కానుకగా అక్టోబర్ 16న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. కానీ నెట్టింట మాత్రం రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. ఈ సినిమా షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉండటం, భారీగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్లో ఉన్నాయంటూ రూమర్స్ మొదలయ్యాయి. అలాగే దసరా రేసులో సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రం ‘జైలర్ 2’ ఉండటంతో పోటీని తప్పించుకోవడానికే డిసెంబర్ 3కు రణబాలిని షిఫ్ట్ చేస్తున్నారంటూ వరుస పోస్ట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ పుకార్లకు ఫుల్స్టాప్ పెడుతూ మేకర్స్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. విజయ్ దేవరకొండ ఈరోజుతో తన పూర్తి భాగానికి సంబంధించిన షూటింగ్ను కంప్లీట్ చేయడంతో చిత్రబృందం గుమ్మడికాయ కొట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ఇక మిగిలిన సమయాన్ని పూర్తిగా పోస్ట్ ప్రొడక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ మెరుగుపరచడానికే కేటాయించనున్నారు. డిసెంబర్కు వాయిదా పడిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని నిర్మాతలు తేల్చిచెప్పారు. మాట ఇచ్చినట్టుగానే దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 16నే ప్రపంచవ్యాప్తంగా రణబాలి థియేటర్లలోకి గ్రాండ్గా రాబోతుందని స్పష్టం చేయడంతో రౌడీ ఫ్యాన్స్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఎంతటి పోటీ ఉన్నా.. తమ కంటెంట్పై నమ్మకంతో ముందే చెప్పిన తేదీకే రణరంగంలోకి దిగడానికి రణబాలి టీమ్ సిద్ధమైపోయింది.

