టాలీవుడ్లో ఒకే సమయంలో ఇద్దరు అగ్ర హీరోల సినిమాల అప్డేట్స్ రావడం ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. అందునా గ్లోబల్ వైడ్గా క్రేజ్ సంపాదించుకున్న రామ్ చరణ్, ఎన్టీఆర్ల చిత్రాల ప్రమోషన్స్ ఒకేసారి షురూ అవుతుండటంతో ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఉత్తరాది (నార్త్) ప్రేక్షకులను నేరుగా టార్గెట్ చేస్తూ, ఈ ఇద్దరు హీరోలు తమ ఈవెంట్స్ కోసం ముంబై వేదికను ఎంచుకోవడం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సన కాంబినేషన్లో వస్తున్న ‘పెద్ది’ (PEDDI) చిత్ర ట్రైలర్ లాంచ్కు సంబంధించి వేదిక మారింది. మొదట ఈ ఈవెంట్ను భోపాల్లో నిర్వహించాలని భావించినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం ఈ వేదికను దేశ ఆర్థిక రాజధాని ముంబైకి మార్చారు. మే 18న ముంబైలో జరగబోయే ఒక గ్రాండ్ ఈవెంట్లో ‘పెద్ది’ అఫీషియల్ థియేట్రికల్ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. జూన్ 4న సినిమా విడుదల కానుండటంతో ఈ ట్రైలర్ హైప్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.
ఇక రామ్ చరణ్ ట్రైలర్ హడావిడి ముగిసిన మరుసటి రోజే, అంటే మే 19న మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ వంతు రానుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ నుండి ఒక స్పెషల్ గ్లింప్స్/టీజర్ను మేకర్స్ విడుదల చేయనున్నారు. ముంబైలో నేషనల్ మీడియా సమక్షంలో ఈ గ్లింప్స్ను ప్రదర్శించేందుకు చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేస్తోంది. తారక్ బర్త్డే (మే 20) కానుకగా ఒకరోజు ముందే రాబోతున్న ఈ అప్డేట్ కోసం నార్త్ ఆడియన్స్ సైతం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. బ్యాక్-టు-బ్యాక్ రోజుల్లో ఈ రెండు భారీ చిత్రాల అప్డేట్స్ వస్తుండటంతో సోషల్ మీడియాలో మెగా, నందమూరి అభిమానుల హడావిడి పీక్స్కు చేరడం ఖాయం.
