Peddi: ‘పెద్ది’కి లైన్ క్లియర్.. పర్సంటేజ్ విధానంపై గుడ్ న్యూస్

Peddi

Peddi

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘పెద్ది’ (PEDDI) విడుదలకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఎగ్జిబిషన్ సెక్టార్‌లో పర్సంటేజ్ విధానంపై కొంతకాలంగా నెలకొన్న సందిగ్ధతకు తెరదించుతూ, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తాజాగా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు మే 18న జరిగిన సబ్ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వివరిస్తూ ఛాంబర్ ప్రెసిడెంట్ డి. సురేష్ బాబు అధికారిక ప్రెస్ నోట్‌ను విడుదల చేశారు. దీంతో మెగా అభిమానులు ఊపిరి పీల్చుకోవడమే కాకుండా, సినిమా రిలీజ్ కోసం మరింత ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

ఎలాంటి అడ్డంకులు లేకుండా ‘పెద్ది’ రిలీజ్
‘పెద్ది’ సినిమా విడుదలకు సంబంధించి నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య ఉన్న సందిగ్ధత పరిష్కారమైంది. ఈ చిత్రాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా అత్యంత సాఫీగా, భారీ ఎత్తున విడుదల చేయడానికి ఫిల్మ్ ఛాంబర్ సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.

టికెట్ రేట్లు పెరిగితే పర్సంటేజీలు ఇవే
టికెట్ రేట్ల పెంపుపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి ఛాంబర్ స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఒకవేళ ఏపీలో ‘పెద్ది’ సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇస్తే ఆ పెరిగిన ధరలపై 7.5% (ఏడున్నర శాతం) వాటాను అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. తెలంగాణలో కూడా టికెట్ రేట్లు పెంచిన పక్షంలో ఏపీకి వర్తించే నిబంధనలే (7.5% వాటా) అమలువుతాయి. ఒకవేళ ఎలాంటి టికెట్ రేట్ల పెంపు లేకపోతే.. ఎప్పటిలాగే ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో చర్చించుకుని పరస్పర అంగీకారంతో సెటిల్ చేసుకుంటారు.

ప్రీమియర్ షోల రేట్లు ఫిక్స్!
భారీ అంచనాలున్న ‘పెద్ది’ సినిమాకు సంబంధించి వేసే ప్రీమియర్ షోలకు కూడా ఫిల్మ్ ఛాంబర్ రేట్లను ఫిక్స్ చేసింది. షోల వారీగా ఎగ్జిబిటర్లకు చేయాల్సిన చెల్లింపులు ఈ విధంగా ఉండనున్నాయి.

‘A’ సెంటర్స్: రూ. 25,000/- (ప్రతి షోకి)
‘B’ సెంటర్స్: రూ. 15,000/- (ప్రతి షోకి)
‘C’ సెంటర్స్: రూ. 10,000/- (ప్రతి షోకి)

మూడు వారాల్లో కొత్త పర్సంటేజ్ సిస్టమ్
రాబోయే రోజుల్లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల మధ్య పర్సంటేజ్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి ఇండస్ట్రీ పెద్దలంతా అంగీకరించారు. తదుపరి పెద్ద సినిమా విడుదలయ్యేలోపు లేదా ఇప్పట్నుంచి మూడు వారాల్లోగా (ఈ రెండింటిలో ఏది ముందైతే అది) టాలీవుడ్ కోసం ఒక కొత్త పర్సంటేజ్ విధానాన్ని ఖరారు చేయనున్నారు. అలాగే, ఇప్పటికే 70 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలకు ప్రస్తుతం ఉన్న పర్సంటేజ్ విధానంలోనే ప్రాధాన్యత ఉంటుందని, మిగతా అన్ని సినిమాలకు భవిష్యత్తులో రాబోయే కొత్త విధానమే వర్తిస్తుందని ఛాంబర్ స్పష్టం చేసింది. మొత్తానికి పర్సంటేజ్ వివాదం సద్దుమణగడంతో ‘పెద్ది’ మూవీ టీమ్ తమ ప్రమోషన్స్ మరియు రిలీజ్ పనులపై పూర్తి స్థాయిలో దృష్టి సారించే అవకాశం దొరికింది.