Jailer 2 vs Om: ఈ దసరాకు కోలీవుడ్లో బాక్సాఫీస్ పోరు రసవత్తరంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సూపర్స్టార్ రజినీకాంత్, ఆయన మాజీ అల్లుడు ధనుష్ సినిమాలు ఒకే సమయంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉండటంతో తమిళ సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ఇప్పటికే రెండు సినిమాల రిలీజ్ డేట్స్ దాదాపు ఖరారైన నేపథ్యంలో ఈ పోటీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ధనుష్ హీరోగా రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఓం’ సినిమాను అక్టోబర్ 16న విడుదల చేయనున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు. ఈ చిత్రంలో మలయాళ సూపర్స్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తుండగా, సాయి పల్లవి, శ్రీలీల హీరోయిన్స్గా నటిస్తున్నారు. విజయదశమి పండుగను టార్గెట్ చేస్తూ ధనుష్ ఈ రిలీజ్ డేట్ను లాక్ చేసుకున్నాడట.
అయితే అనూహ్యంగా రేసులోకి రజినీకాంత్ ‘జైలర్ 2’ వచ్చి చేరింది. నెల్సన్ దిలీప్కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ‘జైలర్’కు సీక్వెల్గా రూపొందుతోంది. భారీ అంచనాలు ఉన్న ఈ పాన్ ఇండియా సినిమాను అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో అక్టోబర్ 15న ‘జైలర్ 2’, అక్టోబర్ 16న ‘ఓం’ విడుదలైతే.. బాక్సాఫీస్ వద్ద మాజీ మామ రజినీకాంత్, మాజీ అల్లుడు ధనుష్ సినిమాలు కేవలం ఒక్కరోజు తేడాతో పోటీ పడినట్లవుతుంది. దీంతో కోలీవుడ్లో ఈ క్లాష్ హాట్టాపిక్గా మారింది. రజినీకాంత్ సినిమా అదే సమయంలో విడుదల కానున్న విషయం తెలిసిన తర్వాత ధనుష్ ‘ఓం’ను దసరా రేసు నుంచి తప్పించాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ‘ఓం’ షూటింగ్ ఇంకా కొనసాగుతుండటంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మిగిలి ఉన్నట్లు సమాచారం. సెప్టెంబర్ వరకు షూటింగ్ కొనసాగే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఈ కారణాలతో అక్టోబర్ 16న కాకుండా దీపావళి సందర్భంగా ‘ఓం’ను విడుదల చేయాలని చిత్రబృందం ఆలోచిస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ‘ఓం’ విడుదల తేదీ మార్పునకు ఓటీటీ ఒప్పందం అడ్డంకిగా మారినట్లు మరో ప్రచారం జరుగుతోంది. ముందుగా కుదిరిన డీల్ కారణంగా దసరా రిలీజ్కే కట్టుబడి ఉండాల్సిన పరిస్థితి ఉందని సమాచారం. అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ ధనుష్ ‘ఓం’ను దసరా బరి నుంచి తప్పిస్తే.. రజినీకాంత్ ‘జైలర్ 2’కి సోలో రిలీజ్ దక్కే అవకాశం ఉంటుంది. లేదంటే కేవలం ఒక్కరోజు వ్యవధిలో రిలీజ్ అయ్యే ఈ రెండు సినిమాలు కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపిస్తాయన్నది ఆసక్తికరంగా మారనుంది.

