గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ డ్రాగన్. ఈ సినిమా కోసం ఇటు నందమూరి అభిమానులు, అటు పాన్-ఇండియా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. లేటెస్ట్ గా డ్రాగన్ నుండి ఇండస్ట్రీని షేక్ చేసే ఒక అప్డేట్ వచ్చేసింది. ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా మే 20న తెల్లవారుజామున 12గంటలకు ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ను విడుదల చేయబోతుంది.
సాధారణంగా సినిమాల ట్రైలర్లే 2 నుండి 3 నిమిషాలలోపు ఉంటాయి. కానీ ప్రశాంత్ నీల్ ఈసారి విధ్వంసం చేసేందుకు ‘డ్రాగన్’ గ్లింప్స్ ను ఏకంగా 4 నిమిషాల 35 సెకన్లతో తీసుకురాబోతున్నాడు. ఇంత లాంగెస్ట్ రన్టైమ్ తో గ్లింప్స్ రావడం టాలీవుడ్ చరిత్రలోనే ఇదే మొదటిసారి. ప్రశాంత్ నీల్ మార్క్ రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎలిమెంట్స్, ఎన్టీఆర్ ఊరమాస్ లుక్ ఈ వీడియోలో పీక్స్లో ఉండబోతున్నాయని, థియేటర్లలో పూనకాలు గ్యారెంటీ అని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ను కేవలం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకే పరిమితం చేయకుండా నేషనల్ లెవెల్లో భారీగా ప్లాన్ చేశారు. దీనికోసం ఎన్టీఆర్ స్వయంగా ముంబై వెళ్లనున్నారు. మే 19 రాత్రి అక్కడ నేషనల్ మీడియా సమక్షంలో ఈ ఫస్ట్ లుక్ మరియు గ్లింప్స్ను గ్రాండ్గా లాంచ్ చేయనున్నారు. ‘కేజీఎఫ్’, ‘సలార్’ చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్ను ఊపేసిన ప్రశాంత్ నీల్.. ఈసారి ఎన్టీఆర్ను ఎలాంటి నెవర్ బిఫోర్ క్యారెక్టర్లో చూపిస్తారోనని బాలీవుడ్ వర్గాలు కూడా ఆసక్తిగా వేచి చూస్తున్నాయి. ఈ పాన్-ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ను మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్తో సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 2027 జూన్ 11న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ లోపు రాబోతున్న ఈ 4 నిమిషాల 35 సెకన్ల మాస్ జాతర సోషల్ మీడియాలో ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి!
