ఓటీటీ చర్చల్లో నితిన్ ‘మాస్ట్రో’!

నితిన్ క‌థానాయ‌కుడిగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘మాస్ట్రో’. ఈ క్రైమ్‌ కామెడీ చిత్రంలో నితిన్‌ సరసన నభా నటేష్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా.. హీరోయిన్ తమన్నా కీలక పాత్ర పోషిస్తోంది. శ్రేష్ఠ్ మూవీస్‌ పతాకంపై రాజ్‌ కుమార్‌ ఆకేళ్ళ సమర్పణలో ఎన్‌.సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఫైన‌ల్ షెడ్యూల్ ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో మొద‌లైన సంగ‌తి తెలిసిందే. హీరో నితిన్, తమన్నాలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించి షూటింగ్ ముగించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో విడుదల తేదీపై ఫోకస్ చేస్తుండగా.. ఓటీటీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఇరువురి చర్చలు కూడా సఫలం అయినట్లు సమాచారం. ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో నేరుగా ‘మాస్ట్రో’ డిజిటల్ రిలీజ్ చేయనున్నారట. త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన రానుందనే టాక్ కూడా నడుస్తోంది.