Nagarjuna: అక్కినేని కుటుంబానికి చెందిన మూడు తరాల హీరోలు ఒకే ఫ్రేమ్లో మెరిశారు. కింగ్ నాగార్జున, యువ హీరోలు నాగచైతన్య, అఖిల్ అక్కినేని కలిసి ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ ‘వెరైటీ ఇండియా’ కవర్పై సందడి చేశారు. ఈ సందర్భంగా నాగార్జున తన సినీ ప్రయాణం, తన కుమారుల కెరీర్కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా తన కెరీర్లో కీలక మలుపుగా నిలిచిన ‘గీతాంజలి’ సినిమాను నాగార్జున గుర్తు చేసుకున్నారు. డైరెక్టర్ మణిరత్నంతో కలిసి ఆ సినిమా చేయడం అప్పట్లో తాను తీసుకున్న సాహసోపేత నిర్ణయాల్లో ఒకటని నాగ్ తెలిపారు. 1989లో రిలీజ్ అయిన ‘గీతాంజలి’ తన కెరీర్కు కొత్త దిశను చూపించిందని చెప్పారు. అలాంటి విభిన్నమైన స్టోరీని ఎంచుకునేందుకు అప్పట్లో ఇతర స్టార్ హీరోలు పెద్దగా ముందుకు రాలేదని, అయినప్పటికీ తాను ఆ ప్రాజెక్ట్ను చేయాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు.
అదే తరహాలో నాగచైతన్య, అఖిల్ కూడా కెరీర్లో ధైర్యంగా అడుగులు వేయాలని నాగార్జున సూచించారు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకే పరిమితం కాకుండా కొత్త కథలు, విభిన్నమైన పాత్రలు ఎంచుకోవాలని తన కుమారులకు చెప్పారు. అయితే 1990లతో పోలిస్తే ప్రస్తుత పరిస్థితుల్లో హీరోలకు రిస్క్ చేయడం అంత సులభం కాదని నాగార్జున అభిప్రాయపడ్డారు. అప్పట్లో వరుసగా కొన్ని సినిమాలు విఫలమైనా తిరిగి సక్సెస్ సాధించే అవకాశం ఉండేదని, కానీ ఇప్పుడు ప్రేక్షకులు ఒక హీరో సినిమాను తిరస్కరిస్తే వెంటనే మరో నటుడి వైపు వెళ్లిపోతున్నారని అన్నారు. “90ల్లో ఏడు సినిమాలు ఫెయిల్ అయినా బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ప్రేక్షకులు మర్చిపోతారు.. మరో నటుడు ఆ స్థానాన్ని భర్తీ చేస్తాడు” అని నాగార్జున పేర్కొన్నారు. మూడు తరాల అక్కినేని హీరోలు కలిసి ‘వెరైటీ ఇండియా’ కవర్పై కనిపించడం అభిమానుల్లోనూ ఆసక్తిని పెంచింది. ఇదే సమయంలో తన కుమారుల కెరీర్ గురించి నాగార్జున చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

