Yellmma : ‘ఎల్లమ్మ’ కోసం యంగ్ సెన్సేషన్?

Yellamma

Yellamma

‘బలగం’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వేణు యెల్దండి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘ఎల్లమ్మ’. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడు. దీంతో టాలీవుడ్‌లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దిల్ రాజు ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అయితే, ఈ సినిమాలో హీరోయిన్ మాత్రం ఇంకా ఫైనల్ కాలేదు.

గతంలో పలువురు ముద్దుగుమ్మల పేర్లు వినిపించగా.. కీర్తి సురేష్ ఆల్మోస్ట్ ఫైనల్ అయిందని అన్నారు. ఇటీవల మృణాల్ ఠాకూర్‌ను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. ‘సీతారామం’, ‘హాయ్ నాన్న’ చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న మృణాల్.. ఈ ఎమోషనల్ రోల్‌కు పర్‌ఫెక్ట్‌గా సెట్ అవుతుందని మేకర్స్ భావించారు. దీనిపై ఆమెతో చర్చలు కూడా జరిగాయని అన్నారు. కానీ ఇప్పుడు ఈ ప్రెస్టెజీయస్ ప్రాజెక్ట్‌లో యంగ్ సెన్సేషన్ మమితా బైజు పేరు వినిపిస్తోంది. ‘ప్రేమలు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ యంగ్ బ్యూటీ.. ప్రస్తుతం వరుస ప్రాజక్ట్స్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో.. ఎల్లమ్మలో మమిత ఛాన్స్ దక్కించుకున్నట్టుగా సమాచారం. ప్రస్తుతానికి మేకర్స్ ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్. ఒకవేళ అంతా అనుకున్నట్లు జరిగితే, డీఎస్‌పీ సరసన మమితా బైజు జోడీ కట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఎల్లమ్మ ఎవరు అనేది సస్పెన్స్‌లోనే ఉంది.