టాలీవుడ్ ‘సూపర్ స్టార్’ మహేష్ బాబు ప్రస్తుతం దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్లోబల్ ప్రాజెక్ట్ ‘వారణాసి’తో బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల ఈ సినిమా షూటింగ్కు చిన్న బ్రేక్ దొరకడంతో బాబు విదేశాలకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఆయన తదుపరి షెడ్యూల్ ఏర్పాట్ల కోసం వెళ్లారా? లేదా వ్యక్తిగత పర్యటనా? అనే సందేహాలకు తెరదించుతూ.. మహేష్ స్వయంగా సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చారు.
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ జర్మనీలోని అత్యంత ప్రసిద్ధి చెందిన ‘బ్లాక్ ఫారెస్ట్’ ప్రాంతంలో ఉన్నారు. అక్కడ ప్రకృతి ఒడిలో ట్రెక్కింగ్ చేస్తూ, సినిమాలోని యాక్షన్ సన్నివేశాల కోసం తనను తాను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ హ్యారీతో కలిసి దిగిన ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. గతంలో ‘గుంటూరు కారం’ విడుదల తర్వాత కూడా మహేష్ ఇదే ప్రాంతంలో ట్రెక్కింగ్ చేయడం గమనార్హం.
రాజమౌళి-మహేష్ కాంబోలో రాబోతున్న ఈ సినిమా ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో సాగే ఒక భారీ యాక్షన్ అడ్వెంచర్గా రాబోతోంది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ను అంటార్కిటికాలో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అక్కడి అత్యంత శీతల వాతావరణాన్ని తట్టుకోవడానికి, కఠినమైన యాక్షన్ సీక్వెన్స్లలో పాల్గొనడానికి అవసరమైన ఫిట్నెస్ కోసమే మహేష్ ఈ ముందస్తు శిక్షణ తీసుకుంటున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. ఏదేమైనా రాజమౌళి మార్క్ మేకింగ్, గ్లోబల్ యాక్షన్ స్టాండర్డ్స్ కలవడంతో వారణాసిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 2027 ఏప్రిల్ 7న వారణాసి విడుదల కానున్న విషయం తెలిసిందే.
