ఉత్కంఠభరిత హత్యా కథాంశంతో రూపొందిన ‘ఎం4ఎం’ చిత్రం మే 8న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. థ్రిల్లింగ్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రంలో అమెరికన్ నటి జో శర్మ, సాంబీత్ ఆచార్య ప్రధాన పాత్రల్లో నటించారు. దర్శకుడు మోహన్ వడ్లపట్ల స్వీయ నిర్మాణంలో మోహన్ మీడియా క్రియేషన్స్ బ్యానర్పై, మెక్విన్ గ్రూప్ యూఎస్ఏ సహకారంతో ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
భారతదేశంలో ఎం4ఎం చిత్రాన్ని పీవీఆర్ ఇనాక్స్ పిక్చర్స్ విడుదల చేయనుండగా.. అమెరికాలో టెక్ఫ్లిక్స్ ఎంటర్టైన్మెంట్, ఉత్తర భారతంలో జేవీఈఎల్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు విడుదల బాధ్యతలు చేపట్టాయి. దాంతో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్కు సన్నాహాలు పూర్తయ్యాయి. థియేటర్లలోకి రాకముందే ఎం4ఎం చిత్రం అంతర్జాతీయ వేదికలపై గుర్తింపు పొందింది. ప్రముఖ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా పాలైస్ సి థియేటర్లో ప్రత్యేక ప్రదర్శన జరగగా.. ముంబైలోని ఇంపా ప్రివ్యూ థియేటర్లో కూడా స్క్రీనింగ్ నిర్వహించారు. ఈ ప్రదర్శనలకు సినీ ప్రముఖుల నుంచి మంచి స్పందన లభించింది.
హీరోయిన్ జో శర్మా అమెరికా, భారత్లో నిర్వహించిన ప్రమోషన్ టూర్ సినిమాకు మరింత క్రేజ్ తీసుకువచ్చింది. సినిమా విడుదలకు ముందే మంచి హైప్ ఏర్పడటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. దర్శకుడు మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ.. మే 8న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల చేయబోతున్నామని తెలిపారు. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడటం గర్వకారణమని, ప్రీమియర్ షోలకు అద్భుత స్పందన వచ్చిందని చెప్పారు. థ్రిల్లింగ్ కథనం, సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని నమ్మకం వ్యక్తం చేశారు.