యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు మరియు సినీ ప్రియులకు ఒక విచారకరమైన వార్త. సోమవారం (జులై 27) సాయంత్రం ఎన్టీఆర్కు అనుకోకుండా భుజానికి గాయమైంది. ఈ విషయాన్ని ఆయన టీమ్ అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించింది. గాయం తీవ్రతను పరిశీలించిన వైద్య నిపుణులు డాక్టర్ జె. మధుసూదన్ రావు, డాక్టర్ ఆర్. ఎ. పూర్ణచంద్ర తేజస్వి నేతృత్వంలోని వైద్య బృందం ఆయనకు పూర్తి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎన్టీఆర్ త్వరగా, పూర్తిగా కోలుకోవడానికి కనీసం 6 నుంచి 8 వారాల పాటు సంపూర్ణ విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు.
అయితే, ఈ గాయం పట్ల అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కంగారు పడాల్సిన పనిలేదని ఎన్టీఆర్ కార్యాలయం ప్రకటనలో స్పష్టం చేసింది. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, విశ్రాంతితో త్వరలోనే కోలుకుంటారని భరోసా ఇచ్చారు. ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఎప్పటికప్పుడు అధికారిక తాజా సమాచారాన్ని అందిస్తామని తెలిపారు.
ప్రస్తుతం ఎన్టీఆర్ పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వైద్యుల సలహా మేరకు ఆయన కొన్ని వారాల పాటు షూటింగ్లకు దూరంగా ఉండనున్నారు. ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు.

