జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని, తిరుపతిలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నారంటూ గత కొద్దిరోజులుగా మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతున్న ఫేక్ ప్రచారం మీద జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ స్టేట్ కన్వీనర్ ఎన్టీవీ తో మాట్లాడారు. ఈ వివాదానికి కారణమైన ఒక అభిమాన సంస్థపై చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నట్లు ఆయన వెల్లడించారు.
ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ స్టేట్ కన్వీనర్ కృష్ణ యాదవ్ NTVతో మాట్లాడుతూ, తిరుపతి వేదికగా ఈ వివాదాన్ని సృష్టించిన ‘RAW ఎన్టీఆర్’ అనే సంస్థపై తాము తిరుపతి జిల్లా ఎస్పీకి అధికారికంగా ఫిర్యాదు చేస్తున్నట్లు ప్రకటించారు. అసలు ఈ సంస్థ వెనుక ఎవరున్నారు, దీని అసలు ఉద్దేశం ఏమిటి అనేది తేలాల్సి ఉందని అన్నారు. ఎన్టీఆర్ మీద ఏదో పెద్ద కుట్ర జరుగుతోందని తమకు అనుమానం ఉన్నట్లుగా కృష్ణ యాదవ్ పేర్కొన్నారు.
గత నాలుగు రోజులుగా ఇంత పెద్ద వివాదం నడుస్తున్నా, ఆ సంస్థ ప్రతినిధులు ఎందుకు నోరు విప్పడం లేదు? ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? జరుగుతున్న రచ్చను చూసి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారా లేక శునకానందం పొందుతున్నారా? అంటూ ఆయన తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. తిరుపతి లాంటి పవిత్రమైన స్థలంలో ఇలాంటి వివాదాలు సృష్టించడం వెనుక వారి అసలు రంగు బయటపడాలని ఆయన అన్నారు. ಭవిష్యత్తులో ఇలాంటి ఫేక్ ప్రచారాలు, అనవసర వివాదాలు తలెత్తకూడదనే ఉద్దేశంతో పోలీసులను ఆశ్రయిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ వివాదాస్పద సంస్థకు జూనియర్ ఎన్టీఆర్ కు గాని, ఆయన అధికారిక అభిమానులకు కానీ ఎలాంటి సంబంధం లేదని కృష్ణ యాదవ్ క్లారిటీ ఇచ్చారు. అసలు ఎన్టీఆర్ ని మానసికంగా ఇబ్బంది పెట్టే వాళ్ళు అభిమానులు ఎలా అవుతారు అని ప్రశ్నించారు. ఈ ఫేక్ వార్తల వల్ల తారక్ ఎంతలా ఇబ్బంది పడి ఉంటే, ఈ రోజు ఆయన టీం ద్వారా అధికారిక పత్రికా ప్రకటన విడుదల చేస్తారని ఆయన ప్రశ్నించారు.

