టాలీవుడ్ సీనియర్ నటి ఇంద్రజ మరోసారి వినూత్న పాత్రలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమయ్యారు. ఇప్పటికే ఎన్నో అద్భుత పాత్రలు చేసిన ఆమె.. ఈసారి రాణి భవాని దేవి పాత్రలో ఆకట్టుకోనున్నారు. ‘విప్లవ వీరుడు’ సినిమాలో ఇంద్రజ భవాని దేవి పాత్ర చేస్తున్నారు. ఈ సినిమాలో జైశ్వర్, సోనాలి జంటగా నటిస్తున్నారు. నాగరాజ్ రావు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఏవీ జయరాం నిర్మిస్తున్నారు. ఫిలింనగర్ దైవ సన్నిధానంలో విప్లవ వీరుడు పూజా కార్యక్రమాలతో షూటింగ్ ప్రారంభించుకుంది. ముహూర్తం షాట్కు ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఇంద్రజపై క్లాప్ కొట్టి సినిమా షూటింగ్ను ప్రారంభించారు.
ఇంద్రజ మాట్లాడుతూ… ‘స్వాతంత్ర కాలం నాటి కథను చాలా సహజంగా తెరకెక్కిస్తున్నారు. సామాన్య ప్రజలు కూడా స్వాతంత్ర పోరాటంలో ఎలా పాల్గొన్నారు అనే అంశాన్ని ఇందులో చూపించబోతున్నాం. ఒక సామాన్యుడు విప్లవ వీరుడిగా మారి.. స్వతంత్ర ఉద్యమంలో విరోచితంగా పోరాడే కథ ఇది. ఈ చిత్రంలో నేను రాణి భవాని దేవి పాత్రలో కనిపించబోతున్నా. బ్రిటిష్ వారిని ఎలా ఎదుర్కొన్నామన్నదే ఈ సినిమా కథాంశం. అర్థవంతమైన కథతో నిర్మాత జయరాం మంచి సినిమా చేస్తున్నారు. సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. మాకు మీ అందరి ఆశీర్వాదాలు కావాలి’ అని అన్నారు.
Also Read: BCCI Recruitment 2026: 10 కోచింగ్ పోస్టులు.. దరఖాస్తులకు బీసీసీఐ ఆహ్వానం!
హీరోయిన్ సోనాలి మాట్లాడుతూ… ‘నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన దర్శకుడు, నిర్మాతకు కృతజ్ఞతలు. ఇది నా మొదటి సినిమా. మీ అందరి ఆశీర్వాదం కావాలి’ అని అన్నారు. హీరో జైశ్వర్ మాట్లాడుతూ… ‘విప్లవ వీరుడు పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నా. ఈ పాత్ర నాకు ఎంతో ప్రత్యేకం. ఇది సినిమా చరిత్రలో నిలిచిపోతుంది’ అని ధీమా వ్యక్తం చేశారు. ‘టిప్పు సుల్తాన్ కాలం నాటి కథ ఇది. బ్రిటిష్ వారు వ్యాపారం పేరుతో దేశాన్ని ఎలా దోచుకున్నారనే పరిణామాలను ఈ సినిమాలో చూపిస్తున్నాం. మంచి సందేశం ఇచ్చే సినిమా ఇది’ అని నిర్మాత ఏవీ జయరాం చెప్పారు.
