ప్రముఖ సినీనటి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత బి. సరోజాదేవి (87) ఇకలేరు. బెంగళూరు లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంతో భారతీయ సినీ రంగం ఒక గొప్ప నటిని కోల్పోయింది. పలు భాషల్లో అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన ఈ లెజెండరీ నటి మృతి వార్త చలనచిత్ర రంగానికి విషాదంలో ముంచింది.1955లో ‘మహాకవి కాళిదాస’ అనే కన్నడ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన బి. సరోజా దేవి,ఆమె నటనా ప్రతిభ, అభినయ నైపుణ్యం, చారిత్రక, కుటుంబ కథా చిత్రాల్లో తనదైన ముద్ర వేశాయి. సౌందర్యానికి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన ఈ నటి, కన్నడ, తెలుగు, తమిళం, హిందీ వంటి అనేక భాషల్లో సూపర్స్టార్ల సరసన నటించారు.
Also Read : Pooja Hegde : పూజా హెగ్డేకు బిగ్ ఛాన్స్ – టాలీవుడ్లో గ్రాండ్ రీ ఎంట్రీ ఖాయం
కాగా తెలుగులో బి. సరోజాదేవి, ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్, కాంతారావు, కృష్ణ వంటి దిగ్గజులతో కలిసి పనిచేశారు. ఇంటికి దీపం ఇల్లాలే,మంచి చెడు,దాగుడు మూతలు,పండంటి కాపురం,దాన వీర శూర కర్ణ,,అల్లుడు దిద్దిన కాపురం.. వంటి సినిమాల్లో ఆమె పాత్రలు మహిళా బలాన్ని, కుటుంబ విలువలను, భర్త పట్ల నిబద్ధతను ప్రతిబింబించేలా రూపొందాయి. ఆమె నటన ద్వారా ప్రేక్షకులు సహజత్వాన్ని, గొప్ప భావోద్వేగాన్ని అనుభవించారు.
బి. సరోజాదేవి సినీరంగానికి చేసిన సేవలకు భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులతో గౌరవించింది. అనేక రాష్ట్ర, జాతీయ అవార్డులు ఆమె ఖాతాలో ఉన్నాయి. తమిళ్, కన్నడ, తెలుగు చలనచిత్ర పరిశ్రమల నుంచి ఆమెకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులు లభించాయి. ఆమె మృతిపట్ల సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. బి. సరోజాదేవి వెండితెరపై చూపించిన విలక్షణమైన నటన, శీలవంతమైన ప్రవర్తన, విలువలతో కూడిన పాత్రలు ఎప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతాయి. బి. సరోజాదేవి మిగిల్చిన కళా వారసత్వం భవిష్యత్తు తరాలకు మార్గదర్శిగా నిలుస్తుంది.