‘మెగా పవర్ స్టార్’ రామ్చరణ్, ఉపాసన దంపతులు కవలలకు తల్లిదండ్రులయ్యారు. శనివారం రాత్రి హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్లో ఉపాసన ఓ మగ, ఆడ శిశువుకు జన్మనిచ్చారు. ఈ శుభవార్తతో ‘మెగా’ కుటుంబంలో సంతోషం రెట్టింపు అయ్యింది. కొణిదెల కుటుంబంతో పాటు కామినేని కుటుంబం మొత్తం ఆనందోత్సాహాల్లో మునిగిపోయింది. మరోవైపు మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. తమ కుటుంబంలోకి కొత్త సభ్యులు వచ్చారని రాత్రే ఎక్స్ వేదికగా వెల్లడించిన మెగాస్టార్ చిరంజీవి.. ఈరోజు అపోలో హాస్పిటల్ వద్ద మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగం చెందారు.
చిరంజీవి మాట్లాడుతూ… ‘చాలా చాలా సంతోషంగా ఉంది. కొణిదెల ఫ్యామిలీ, కామినేని ఫ్యామిలీ అందరం ఎంతో ఆనందంగా ఉన్నాం. రామ్చరణ్–ఉపాసన రాత్రి కవలలకు జన్మనిచ్చారు. ఉపాసనతో పాటు బిడ్డలు ఇద్దరూ చాలా హెల్తీగా ఉన్నారు. ఎప్పటి నుంచో, ఎక్కడెక్కడి నుంచో మా ఇంట శుభం కలగాలి అని ఎంతో మంది కోరుకున్నారు. ఆ భగవంతుడి దయతో, హనుమాన్ కృప వల్ల ఒక ఆడబిడ్డ, ఒక మగబిడ్డ జన్మించారు. ఈ శుభవార్తను మీతో పంచుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అభిమానులు ఇంతగా ఆనందం వ్యక్తం చేయడం మా కుటుంబానికి ఎంతో ఆనందం. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు’ అని అన్నారు.
Also Read: Greatest T20 Team: 11 మంది మ్యాచ్ విన్నర్స్.. టీ20 వరల్డ్కప్కు భారత గ్రేటెస్ట్ టీ20 టీమ్ సిద్ధం!
మెగా కుటుంబంలో కొత్త అతిథుల రాకతో ఆనందం రెట్టింపు అయింది. రామ్చరణ్-ఉపాసన దంపతులకు అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రామ్చరణ్, ఉపాసనలు 2012లో వివాహం చేసుకున్నారు. వారికి 2023 జూన్ 20న క్లీంకార కొణిదెల జన్మించిన విషయం తెలిసిందే. శనివారం (2026 జనవరి 31) కవల పిల్లలు జన్మించారు. అపోలో హాస్పిటల్లో కవలలతో మెగా పవర్ స్టార్ ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అటు ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం, ఇటు వారసుడు రావడంతో చిరు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
